తొగుట: మల్లన్నసాగర్.. రైతుల తలరాత మార్చే, తరతరాలు నిలిచే ప్రాజెక్టు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. అనతి కాలంలోనే గొప్ప పని మన కళ్లముందు ఆవిష్కృతమైందని సంతోషం వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఇంజినీర్లు, ప్రజాప్రతినిథులతో కలిసి మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కల సాకారమయిందన్నారు.
మల్లన్నసాగర్లోకి ప్రస్తుతం 11 టీఎంసీ నీరు వచ్చిందని, అవి 30 మీటర్ల ఎత్తు వరకు ఉన్నాయని, బండ్ మొత్తం 22 కిలోమీటర్లు ఉండగా.. దాదాపు 20 కిలోమీటర్ల మేర నీళ్లు చేరాయన్నారు. ఇది ఎప్పటికీ నిలిచిపోయే గొప్పపని అని, అనతి కాలంలోనే దీనిని పూర్తి చేసుకున్నామని గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు.