జనగామ, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘ఒక్కోమెట్టు ఎక్కుతూ అన్నిరంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. తప్పిపోయి కాంగ్రెస్ చేతికి పాలన పోతే కైలాసంలో పెద్దపాము మింగినట్టు అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం పాతాళంలో జారిపడుతుంది జాగ్రత్త’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. బుధవారం టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల సమన్వయ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీచైర్మన్ పాగాల సంపత్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జల్లి సిద్ధయ్య, మున్సిపల్, మార్కెట్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఒక్క చాన్స్ ఇవ్వండని అడుగుతున్న కాంగ్రెస్కు 11సార్లు అధికారమిచ్చినా చేయలేని పనులను సీఎం కేసీఆర్ పదేండ్లలోనే చేసి చూపించారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో అవినీతి మూటలు తీసుకొని ముఠాలు కట్టడం తప్ప ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మి ఆగం కావొద్దని కోరారు. కాంగ్రెస్ సెక్యులర్ పేరు చెప్పి ముస్లిం ఓట్లు దండుకుని అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. ‘అసలు మీ పాలనకు కేసీఆర్ పాలనకు పొంతన ఉన్నదా? కరువు, దుర్భిక్షానికి ట్యాగ్లైన్ మీ పాలన’ అని ఎద్దేవా చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఒక్కటైనా కాంగ్రెస్ అమలు చేసి చూపిందా? అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలువదని, కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా రాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో ముస్లింలు డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తే, తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ చదువుకుంటున్నారని తెలిపారు.
జనగామ అప్పుడెట్లుండే.. ఇప్పుడెట్లున్నది?
‘కాంగ్రెస్ హయాంలో జనగామ ఎట్లుండె. ఇప్పుడు ఎట్లుందో ఆలోచించండి. అభివృద్ధి మీ కండ్ల ముందున్నది. ఒకనాడు కరువు విలయతాండవం చేసిన ఎగువ ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసిన బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలి’ అని హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. జనగామలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం. అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తు న్నం. జాగ ఉన్న వారికి గృహలక్ష్మి కింద ఆర్థికసాయం అందజేస్తున్నాం. విద్య, వైద్యం, రోడ్ల కు ప్రాధాన్యమిచ్చాం. జనగామలో మెడికల్ కాలేజీ ప్రారంభించుకున్నాం. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డిని ఆశీర్వదిస్తే కేసీఆర్తో కొట్లాడి మరీ సిద్దిపేట, సిరిసిల్లతో పోటీ పడి జనగామను మరింత అభివృద్ధి చేస్తారు’ అని చెప్పారు.
కేసీఆర్కు జనగామ అంటే ప్రేమ
2001లోనే గులాబీజెండాకు అడ్డాగా నిలిచిన జనగామ అంటే సీఎం కేసీఆర్కు ఎనలేని ప్రేమ అని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చినట్టే ఇచ్చి కాంగ్రెస్ వెనక్కి తీసుకున్న సమయంలో ఉస్మానియాలో సూర్యాపేటకు చెందిన దోసపాడు వేణుగోపాల్ అనే విద్యార్ధి ఆత్మాహుతి చేసుకొని ఉవ్వెత్తున ఉద్యమం లేచిన సమయంలో 2010లో పల్లా పరిచయం అయ్యారని వివరించారు.
ఈ నెల 16న జనగామలో సీఎం కేసీఆర్ సభ లక్ష మందితో నిర్వహించాలని హరీశ్రావు పిలుపునిచ్చారు. క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఆహ్వానించి ఊర్లకు ఊర్లు సభకు వచ్చేలా చూడాలని సూచించారు. జనగామకు జిల్లా ఇచ్చి బ్రహ్మండమైన కలెక్టరేట్ నిర్మించి, మెడికల్ కాలేజీ మంజూరు చేసిన అధినేత కేసీఆర్కు అద్భుతమైన స్వాగతం పలకాలని కోరారు. అందరికీ అందుబాటులో ఉండే అద్భుతమైన ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని కేసీఆర్ ఎంపిక చేసి పంపించారని పల్లాను నిండు మనసుతో దీవించాలని, జనగామ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే సత్తా ఆయనలో ఉన్నదని చెప్పారు. ఇంత ఉత్సాహంతో ఓపికగా ఉంటున్న కార్యకర్తల కాళ్లు కడిగి నెత్తి మీద పోసుకున్నా తకువే అని పేర్కొన్నారు. జనగామలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ పోటీ కానేకాదని, టికెట్ కోసం పోటీ పడుతున్న ఒకాయన కన్నతండ్రికి అన్నం పెట్టనోడని, ఇంకో ఆయన ఆరునెలలకోసారి కూడా ఇటువైపు చూడని నాయకుడని ఎద్దేవా చేశారు. చేర్యాలను డివిజన్ కేంద్రంగా ప్రకటించే అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు.
ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా: పల్లా రాజేశ్వర్రెడ్డి
‘ఉద్యమ సమయంలో 15 ఏండ్లుగా కేసీఆర్ వెన్నంటి నడిచి, పదేండ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగి జనగామ ప్రాంతంలోని ప్రతి చెరువుకూ నీళ్లు ఇచ్చి సాగునీటిలో అద్భుతమైన కృషి చేసిన మా పెద్దన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మంచి మనసుతో నన్ను ఆశీర్వదించారు. ఆయన సూచనలతో గత అభివృద్ధి స్ఫూర్తితో జనగామ అభివృద్ధికి కృషి చేస్తా’ అని బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి హామీ ఇచ్చారు. ‘ఏ విషయంలోనూ మధ్యవర్తుల ప్రమేయం, పెత్తనం లేకుండా జనగామ పౌరుడు ఎవరు వచ్చినా సేవ చేస్తానని అభయమిచ్చారు. జనగామ జిల్లాను ఇచ్చిన కేసీఆరే చేర్యాల డివిజన్ కూడా ఇస్తారని భరోసా ఇచ్చారు.
‘పల్లా’ను ఆశీర్వదించండి: ముత్తిరెడ్డి
తమ్ముడు పల్లా రాజేశ్వర్రెడ్డిని జనగామ ప్రజలు నిండుగా ఆశీర్వదించాలని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో 14 ఏండ్ల తన ప్రయాణంలో ఎవరికైనా ఇబ్బందులు జరిగితే, తెలియకుండా ఎవరినైనా నొప్పిస్తే నిండు మనస్సుతో క్షమించాలని కోరారు. అభివృద్ధికి సహకరించిన ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను సంకల్పించిన అభివృద్ధి కార్యక్రమాలను పల్లా రాజేశ్వర్రెడ్డి పూర్తి చేస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నదని చెప్పారు. నియోజకవర్గం పుట్టినప్పటినుంచి ఎవరికీ రానంత మెజార్టీ రాబోయే ఎన్నికల్లో వస్తుందని సీఎం కేసీఆర్కు గ్యారెంటీ ఇస్తున్నానని చెప్పారు.