Minister Harish rao | హుస్నాబాద్, సెప్టెంబర్ 13: ‘బీజేపోళ్లకు భయం పట్టుకున్నది. బిచానా ఎత్తేసిండ్రు. అందుకే జమిలి జమిలి అంటూ కొత్త డ్రామా తెచ్చిండ్రు. తెలంగాణలో ఒక్క సీటు వచ్చేట్టులేదని, నూకలు చెల్లినయ్ అని వాళ్లకు అర్థమైంది. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఎల్లెల్కల పడ్తమని జమిలి అని కథ మొదలుపెట్టిండ్రు. జమిలీ కాదు.. జనాన్ని నమ్ముకున్నోడే నిలవడ్తడు. జమిలీతో డ్రామాలు నడువయ్. జనం మనసులో ఉన్నోడే గెలుస్తడు. జనం మనసులో ఉన్నోడే నిలుస్తడు. జనం పక్షాన నిలబడ్డవాడినే జనం కాపాడుకుంటరు. బీజేపీ జమిలి డ్రామాలు తెలంగాణలో చెల్లవు’ అని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం శుభం గార్డెన్ సమీపంలో ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సభలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు ఐవోసీ భవనంలోనూ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజలను నూకలు బుక్కుమని చెప్పిన బీజేపీకి రాష్ట్రంలో నూకలు చెల్లిపోయాయని ఎద్దేవా చేశారు. కులం, మతం, జాతి సెంటిమెంట్తో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజల మనోభావాలు అర్థమయ్యాయని, అందుకే వారి ఉనికి కనిపించటం లేదని అన్నారు. జమిలి ఎన్నికలంటూ కొత్త నాటకానికి తెరలేపుతున్నారని, బీజేపీకి ఢిల్లీ రాజకీయం తప్ప గల్లీ ప్రజల మనోభావాలు తెలియవని విమర్శించారు. ‘రైతులకు కరెంటు ప్రైవేట్ పరం చేయాలని, బోరు బావులకు మీటర్లు పెట్టాలని, వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలని నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ. నల్లాలిచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కావాల్నా? నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ ప్రభుత్వం కావాల్నా?’ అని ప్రజలను అడిగారు.
ఇచ్చిన హామీలను విస్మరించేది కాంగ్రెస్ అయితే, ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్దే అని మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయని పథకాలను కేవలం తెలంగాణలో అమలు చేస్తామని వస్తున్నారంటే అధికారం కోసమేనేది ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు.. సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమం మధ్యే జరుగుతాయని తెలిపారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పగానే కాంగ్రెస్ శ్రేణుల్లో వణుకు మొదలైందని, తమ ఉనికి లేకుండా పోతుందని అబద్ధపు ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ హయాంలో ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గంలోనే రూ.7,752 కోట్ల అభివృద్ధి జరిగిందంటే, మిగతా నియోజకవర్గాల అభివృద్ధి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని తెలిపారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ, మిడ్మానేరు, గౌరవెల్లి లాంటి భారీ ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల అభివృద్ధి, పుష్కలంగా ఉచిత కరెంటు, అన్ని వర్గాల అభ్యున్నతి సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని వివరించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, సిద్దిపేట, హనుమకొండ జిల్లా పరిషత్తు చైర్మన్లు వేలేటి రోజాశర్మ, డాక్టర్ సుధీర్కుమార్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి, జడ్పీ వైస్చైర్మన్ రాజిరెడ్డి, హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధి పట్ల కేంద్రంలోని బీజేపీకి బరువు లేదు.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామనుకుంటున్న కాంగ్రెస్కు బాధ్యత లేదని ఆర్థిక మంత్రి హరీశ్రావు చురక అంటించారు. ఈ రెండు పార్టీలు కేవలం అధికారమే లక్ష్యంగా సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమవుతున్నాయని మండిపడ్డారు. దొంగ డిక్లరేషన్లు, సాధ్యం కాని గ్యారెంటీలతో వస్తున్న కాంగ్రెస్ నాయకులను, మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలను విచ్ఛిన్నం చేసి అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్న బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. జేబులు నింపుకొనే కాంగ్రెస్ను, జమిలి ఎన్నికలంటూ అయోమయానికి గురిచేస్తున్న బీజేపీని ఇంటికి పంపి కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేసేందుకు ప్రజలు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకున్నారని స్పష్టం చేశారు.