హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): బడ్జెట్ అంటే చిట్టాపద్దు కాదు, గుండెగుండెకు ఆత్మబలాన్ని నింపే బ్యాలెన్స్షీట్ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు సుదీర్ఘ ప్రసంగంలో తేల్చిచెప్పారు. రాష్ట్రంపై కత్తిగట్టిన కేంద్రం కుట్రలను ఎత్తిచూపుతూనే తెలంగాణ ప్రగతికి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కారు ఎలుగెత్తి చాటుతున్న ఘనచరితను ఆవిష్కరించారు. తెలంగాణ తీసిన తొవ్వలో యావద్భారతం అడుగేయాల్సిన అనివార్యతను సీఎం కేసీఆర్ ఎలా సృష్టించారో కండ్లకు కట్టారు. ఏకంగా 2:12 గంటలు అసెంబ్లీ సాక్షిగా అబ్బురపరిచేరీతిలో ప్రసంగించారు. బుధవారం 2023-24కు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దుపై చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చిన తీరుపై ఆర్థిక నిపుణులు, రాజకీయ విశ్లేషకులు అబ్బురపడుతున్నారు. పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు సైతం‘ఔరా’అనేలా ఉన్నది. ప్రభుత్వంపై తెల్లారిలేస్తే వీధిపోరాటం చేసే విపక్ష సభ్యులు సైతం హరీశ్ సాధికారిక, సావధాన సమాధానంతో సంతృప్తి వ్యక్తంచేశారు. ‘వాళ్ల స్థానంలో మేమున్నా ఇలా చేయలేకపోతుం. రాజకీయ పార్టీలుగా అనాలి కాబట్టి అంటాం. కానీ, ఇంతకన్నా ఎవరు చేస్తారు’ అని హరీశ్రావు అసెంబ్లీలో చేసిన ప్రసంగం అనంతరం ఒక విపక్ష పార్టీ సీనియర్ సభ్యులు వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ నగరానికి మంచినీళ్లు ఇచ్చింది తామే అని చెప్పుకొనే సీఎల్పీ నేత భట్టికి మంత్రి హరీశ్ గట్టి సమాధానం చెప్పారని బీఆర్ఎస్ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్కు మంచినీళ్లు ఇస్తే.. మరి పీజేఆర్ ఎందుకు ధర్నాలు చేసేవారో అని ఉదహరించి ఆ పార్టీ నేతలను హరీశ్ ఇరకాటంలో పెట్టారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా చేసిన ప్రసంగంలో అప్పటి కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి అరుణ్జైట్లీపై… నాటి బీజేపీ పక్ష నేత లక్ష్మణ్ను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని హరీశ్ వినిపించారు. ‘కేంద్రం రాష్ట్ర అభివృద్ధికి సహకరించటం లేదు, తెలంగాణపై చిన్నచూపు చూస్తున్నది. మీకు చేతనైతే (బీజేపీ పక్షనేత లక్ష్మణ్) చేయండి కానీ, రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చకండి’ అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలను సభలో ప్రదర్శించారు. అనంతరం మంత్రి హరీశ్ మాట్లాడుతూ ‘మా రాజేంద్రన్న ఇక్కడున్నప్పుడు మంచిగనే ఉండేవాడు.. ‘కాషాయంలో కలిసిండు.. కషాయం మింగిండు’అన్ని ఏవేవో మాట్లాడుతుండు. జన్కీ బాత్ వినుడు బంద్జేసి, మన్కీ బాత్ వింటున్నడు.. జరా జన్కీ బాత్ వినే రాజేంద్రన్నా’ అని చెప్పారు. తాము సిద్ధాంతాలు.. విధానాలపై పోరాటం చేస్తాం తప్ప, వ్యక్తులతో పంచాయితీ ఎందుకుంటది అని హుందాతనాన్ని ప్రదర్శించిన తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.