హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన సెస్సుల రూపంలో ఆదాయం సమకూర్చుకుంటోందని ఆర్థిక మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. శాసనసభలో ఎఫ్ఆర్బీఎం చట్టంలో కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి, రాష్ట్ర ప్రగతిపై దాని ప్రభావంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘రఘునందర్రావు అందమైన అబద్ధం ఆడే ప్రయత్నం చేశారు. కొత్త సభ్యుడు కదా.. అవగాహన లేక మాట్లాండి అనుకుంట. సీఎం కేసీఆర్ గతంలో మాట్లాడుతూ నరేంద్ర మోదీ 32శాతం నుంచి 42 శాతానికి పెంచారని చెప్పారన్నారని, నిజమే చెప్పామని, కానీ వీళ్ల ముసుగు ఎలా ఉందంటే.. 32 నుంచి 42 శాతానికి పెంచినట్టే పెంచారు.
దాన్ని నమ్మినం. ప్రధాని స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సరిగా అమలు చేస్తారని నమ్ముతం. నోటితో నవ్వి, నొసటితో వెక్కిరిస్తుందని అనుకోం కదా? వీళ్ల తీరు అట్లుంది. 42శాతానికి పెంచామంటే హర్షం వ్యక్తం చేసినం. ఏదైనా మంచిపని జరిగితే మంచిని మంచి అని చెప్పే సంస్కారం తెలంగాణకు ఉన్నది. కానీ, జరిగిందేందంటే.. కానీ, సెస్సుల రూపంలో పన్నుల వాటాను దించారు. పైకి ఏమో 32 నుంచి 42శాతానికి పెంచారు. కానీ, పెట్రోల్ మీద సెస్సు, ఎడ్యూకేషన్ మీద సెస్సు, డీజిల్ మీద సెస్సు అని కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిని సెస్సుల రూపంలో తమ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రయత్నం చేసింది’ అని ఆరోపించారు.
‘కేంద్ర ప్రభుత్వ ఖజానాకు.. కాన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకు వస్తే దాంట్లో 42శాతం వాటా రాష్ట్రాలకు పంచుతరు. సెస్ల రూపంలో వచ్చిన డబ్బును రాష్ట్రాలకు పంచడం జరుగదు. రాష్ట్రాలకు డబ్బులు పంచకూడదని సెస్సుల రూపంలో తమ ఆదాయాన్ని సమకూర్చుకునే ప్రక్రియను ప్రారంభించారు. పోయిపోయి ఎక్కడి వరకు వచ్చిందంటే.. నిజానికి లెక్కదీస్తే.. సెస్సుల మీద కేంద్రం ఎంత సమకూర్చుకున్నదంటే.. 2021-22లో కేంద్ర ప్రభుత్వం తనకు వచ్చే ఆదాయంలో 22.56శాతం సెస్సుల రూపంలో సమకూర్చుకున్నది. ఇక పంచింది 42శాతం 78శాతంలోంచి మాత్రమే రాష్ట్రాలకు పంచారు.
రాష్ట్రానికి ఇవాళ పన్నుల వాటా 29.6శాతం మాత్రమే వస్తున్నది. చెప్పిందేమో 42శాతం.. కానీ ఇచ్చింది 29.6శాతం. నిజంగా 42శాతం ఇచ్చినట్లయితే రాష్ట్రానికి రూ.33,712కోట్లు రాష్ట్రానికి వస్తుండే. దీని వల్ల 12.4శాతం నష్టపోతున్నం. 2014-15లో రూ.3336కోట్లు, 2015-16లో రూ.2,548కోట్లు, 2016-17లో రూ.2,680కోట్లు నష్టపోయాం.. ఇలా తొమ్మిది సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ.33,712కోట్ల నష్టం చేసింది. రూ.33వేలకోట్లు వచ్చి ఉంటే.. ఇవాళ అప్పుతక్కువగా తీసుకునేవాళ్ల. సభ్యులు మాట్లాడుతారు.. 42శాతం ఇచ్చినం అంటున్నరని.. కానీ, 42శాతం ఇస్తామని చెప్పారు. కానీ, వాస్తవంగా ఇచ్చింది 29.6శాతం మాత్రమే’ అని విమర్శించారు.
భట్టి విక్రమార్క మాటలు ఎట్ల ఉన్నయంటే.. ‘గుమ్మిల వడ్లు.. గుమ్మిలనే ఉండాలే.. గూటం లెక్క పిల్లలుండాలట’ అన్నట్టున్నది. మా పరిపాలన చాలా గొప్పగు ఉండే అని భట్టి విక్రమార్క చెప్పారు.. మాకు కాంగ్రెస్ పరిపాలన తెలియందా? ఎప్పుడన్నా ఈ శాసనసభ ఖాళీ కుండలు లేకుండా, కన్నీళ్లు లేకుండా ఎప్పుడన్నా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండెనా?.. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఎప్పుడు చూసినా.. అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఖాళీ కుండల ప్రదర్శనతో శాసనసభకు బయలుదేరిన ఎమ్మెల్యేలు.. కన్నీళ్లతో గన్పార్క్ నుంచి బయలుదేరిన ఎమ్మెల్యేలు.. ఎండిపోయిన మక్కజొన్న, వరి కంకులతో శాసనసభకు బయలుదేరిన ప్రతిపక్ష శాసనసభ్యులు.. ఇది సినిమా కదా..
ఎప్పుడన్నా ఈ తెలంగాణ శాసనసభలో ఎనిమిదేళ్లలో కరెంటు వస్తలేదు? ఒక్క సభ్యుడు మాట్లాడిండా? మంచినీళ్లు వస్తలేవు అని ఒక్క మాట మాట్లాడిండా? ఖాళీ కుండల ప్రదర్శన ఏ రోజైనా ఈ శాసనసభలో జరిగిందా? అంటే.. మీ పరిపాలన ఉండాలని కోరుకోకండి. మా పరిపాలనలెక్క చేయాలంటే కరెంటు కోతలు.. నీటి బాధలు.. ఎండిపోయి పంటలు.. కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. కావాలంటున్నారా భట్టిగారు.. ఎరువులు కావాలంటే చెప్పులు క్యూలైన్లలో పెట్టి రోజుల తరబడే పాతరోజులు గుర్తు చేయకండి. ఆ రోజులు గుర్తు చేసుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. గతంలో ఒక ప్రభుత్వం ఉండే.. పెంచిన కరెంటు బిల్లులు పెంచిన కరెంటు బిల్లులు తగ్గించమంటే బషీర్భాగ్ చౌరస్తాల్లో రైతుల్ని పిట్టల్లాగా కాల్చిన చంపిన ప్రభుత్వాలున్నాయ్. కానీ, ఈ ప్రభుత్వం రైతులకు 24గంటల ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం’ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా అప్పులు తీసుకువస్తే విద్యుత్ రంగం, సాగునీటిరంగంలో, తాగు, సాగునీటిరంగంలో ఖర్చు పెట్టాం. ప్రతిపైసా ప్రజల అవసరాలు, ఆకాంక్షలు.. ఎన్నో పోరాటాలతో, తాగ్యాలతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నం. ఈ పోరాట ఫలితాలు ప్రజలకు అందాలి. తెలంగాణ ఉద్యయమమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇవాళ నీళ్లు వచ్చాయ్ కదా? బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణంగా మారింది. పండిన పంటలే దీనికి సాక్ష్యం. భారతదేశంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.
తెలంగాణ చాంపియన్. తెలంగాణలో ప్రారంభించిన మిషన్ భగీరథ.. దేశానికి హర్ ఘర్ జల్కు ఆదర్శంగా నిలబడింది. ఇది తెలంగాణ పనితీరు. నీతి ఆయోగ్ సిఫారసు చేసినా.. మొండి చేయి చూపిన ప్రభుత్వం ఈ కేంద్రంలోని ప్రభుత్వం. ఈ మధ్య భారత పార్లమెంట్లో 2020 సెప్టెంబర్ 17న రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాల సంఖ్య ఎంత తెలంగాణలో అడిగితే.. ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు ఒక్కటి లేదు. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది.
‘భట్టి విక్రమార్క గారు.. మాలెక్క చేయండంటే.. కొన్ని లక్షల మంది ఫ్లోరైడ్ బారినపడి కాళ్లు, చేతులు వంకరపోయే విధంగా ఉంచమని చెబుతారా? గతంలో పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉంటే.. నల్లగొండ జిల్లా నుంచి కాళ్లు, చేతులు వంకర్లు పోయిన పిల్లల్ని ప్రధాని టేబుల్ మీద ఉంచితే కనికరం రాని ప్రభుత్వం మీది. ఢిల్లీలో కాంగ్రెస్ ఉన్నా? గల్లీలో కాంగ్రెస్ ఉన్నా కనీసం ఫ్లోరైడ్ బాధను తీర్చలేని చేతగానీ, చేవగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.
దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న ఫ్లోరైడ్ సమస్యను పరిష్కారం చేయలేకపోయారు. కానీ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో.. ఇదే శాసనసభలో ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా.. వచ్చే శాసనసభ ఎన్నికల్లోపు ఇంటింటికీ నల్లా పెట్టించి నీళ్లు ఇవ్వకపోతే.. ఓట్లే అడగా అని చెప్పిన దమ్ము, ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్. మీలాగా ఓట్ల కోసం చెప్పలే.. తెలంగాణ ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్ర నాయకుడి, ప్రభుత్వ అధినేత ఉన్నడు గనుక, ఫ్లోర్ కష్టాలు చూసిండు గనుక ఉద్యమంలో గల్లీ గల్లీ తిరిగిన నేత గనుక ఆ కష్టాలను తీర్చాలని హృదయంలోంచి వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికీ నీళ్లు ఇస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్’ అన్నారు.