2014లో నీతిఆయోగ్ ఆరోగ్య సూచీలో తెలంగాణ 11వ స్థానంలో ఉంటే, ఇప్పుడు 3వ ర్యాంకుకు చేరుకున్నాం. మొదటి స్థానానికి చేరడానికి అడుగులు వేస్తున్నాం. మరో ఏడాదిలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య 50 వేలకు చేరనున్నది. ప్రతి దశలోనూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పటిష్ఠమైన వైద్య వ్యవస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోగలిగాం. బడ్జెట్ను నాలుగు రెట్లు పెంచుకున్నాం. ఫలితంగా 9 ఏండ్లలోనే తెలంగాణ వైద్యారోగ్యరంగం దేశానికే రోల్మాడల్గా నిలిచింది. దీనికి కర్త, కర్మ, క్రియ అన్నీ సీఎం కేసీఆరే.
– మంత్రి హరీశ్ రావు
2014కు ముందు.. వచ్చినరోగం కన్నా సర్కారు వైద్యం అంటేనే ఎక్కువ జడిసే కాలమది. ప్రభుత్వ దవాఖానలు సమస్యల సాలెగూళ్లుగా ఉండేవి. వైద్యసేవలు అంతంతే. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏండ్లలో వైద్యారోగ్య రంగం కొత్తపుంతలు తొక్కింది. కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగ బడ్జెట్ను నాలుగురెట్లు పెంచిన ఫలితంగా మౌలికవసతులు, మెడికల్ కాలేజీలు, అధునాతన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యసేవల్లో నాణ్యత, ప్రజల్లో నమ్మకం పెరిగింది.
Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్య రంగంలో పదేండ్లలోనే అనూహ్య ప్రగతి నమోదైంది. ఎర్రగోలీ, పచ్చగోలీ అని జోకులు వేసుకున్న కాలం నుంచి ప్రభుత్వ దవాఖానలు కార్పొరేట్ను మించి చికిత్స అందిస్తున్నాయన్న స్థాయికి ఎదిగాయి. గర్భిణులకు పోషకాహారం అందించి, క్రమం తప్పకుండా చెకప్లు చేసి, సురక్షితంగా పురుడు పోసే పుట్టినిల్లుగా మారాయి. తలనొప్పి దగ్గరి నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చయ్యే అవయవ మార్పిడి చికిత్సల వరకు జరుగుతున్నాయి. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించటమే కాదు.. వ్యాధులు రాకుండా యంత్రాంగం నివారణ చర్యలూ తీసుకుంటున్నది. మూడంచెల ఆరోగ్య సేవలు ఐదంచెలుగా మారాయి. ఏ రోగం వచ్చినా బేఫికర్.. ప్రభుత్వ దవాఖానలు మనకు అండగా ఉన్నాయి అన్న భరోసా ప్రజల్లో కలిగింది. మంత్రం వేస్తేనో, మాయ చేస్తేనో ఇదంతా సాధ్యం కాలేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ‘ఆరోగ్య తెలంగాణ’గా మార్చాలన్న సీఎం కేసీఆర్ సంకల్ప ఫలితం. అన్ని స్థాయిల దవాఖానల్లో సదుపాయాలు కల్పించటంతోపాటు సిబ్బందిని నియమించటం, దేశానికే ఆదర్శంగా నిలిచేలా పథకాలు, కార్యక్రమాలు అమలు చేయటం వల్లే ఇది సాధ్యమైంది. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సోమవారం విడుదల చేసిన ‘పదేండ్ల ప్రగతి నివేదిక’ ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నది.
జిల్లాకో మెడికల్ కాలేజీ
రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఐదే. ఇందులో గాంధీ, ఉస్మానియా కాలేజీలు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడే ఏర్పాటయ్యాయి. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. అంటే.. ఆరు దశాబ్దాల ఉమ్మడి పాలనలో ఏర్పాటు చేసినవి ఆదిలాబాద్, నిజామాబాద్ మెడికల్ కాలేజీలు మాత్రమే. అవి కూడా తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 30 ఏండ్లకు ఒక కాలేజీ ఏర్పాటు చేస్తే, సీఎం కేసీఆర్ 9 ఏండ్లలోనే 21 కాలేజీలను ఏర్పాటు చేశారు. మరో 8 కాలేజీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాదితో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కల సాకారం కానున్నది. ప్రజలకు మెరుగైన సేవలు అందాలంటే డాక్టర్లు ఎంత ముఖ్యమో నర్సులు, పారామెడికల్ సిబ్బంది కూడా అంతే ముఖ్యమని సీఎం కేసీఆర్ గుర్తించారు. జిల్లాకో నర్సింగ్, పారామెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రైవేట్ రంగంలోనూ భారీగా విద్యాసంస్థలు పెరిగాయి. దీంతో వైద్యవిద్యకు తెలంగాణ కేరాఫ్గా మారింది.
మూడు రెట్లు పెరిగిన తలసరి బడ్జెట్
2014 నుంచి ఏటికేడు వైద్యారోగ్యరంగ బడ్జెట్ పెరుగుతూనే ఉన్నది. మొదట్లో రూ.4,932 కోట్లు మాత్రమే ఉన్న బడ్జెట్ ఎనిమిదేండ్లలోనే రెండున్నర రెట్లు పెరిగింది. ‘మొదటి విడతలో ఇరిగేషన్, సంక్షేమంపై ఎక్కువగా దృష్టిపెట్టాం. రెండో విడతలో విద్య, వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం’ అని సీఎం కేసీఆర్ ఓ సందర్భంలో చెప్పారు. దానికి తగ్గట్టే 2019-20 నుంచి హెల్త్ బడ్జెట్కు ప్రాధాన్యం మరింత పెరిగింది. ఈ ఏడాది ఏకంగా రూ.12,364 కోట్లకు చేరింది. తద్వారా తలసరి వైద్య బడ్జెట్ కేటాయింపుల్లో దేశంలోనే మూడోస్థానంలో, పెద్ద రాష్ర్టాల్లో మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది.
ఏటా 10 వేల మంది డాక్టర్లు
ఒకప్పుడు తెలంగాణలో వైద్యవిద్య చదవాలంటే చైనా, ఉక్రెయిన్ వంటి దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఏటా 10 వేల మంది వైద్యులను తయారుచేసే ‘డాక్టర్ల ఖార్ఖానా’గా తెలంగాణ మారింది. ఇప్పటికే 21 కాలేజీలు ఏర్పాటు చేయగా, మరో 8 కాలేజీలు వచ్చే ఏడు ప్రారంభం కానున్నాయి. ఫలితంగా 2014తో పోల్చితే రాష్ట్రంలో ఎంబీబీఎస్, పోస్ట్గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ సీట్లు గణనీయంగా పెరిగాయి. ‘మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోగనిరోధక శక్తి ఉండాలంటే రక్తంలో తెల్ల రక్తకణాలు పనిచేసినట్టే.. తెలంగాణ నుంచి తయారుకాబోతున్న తెల్లకోటు డాక్టర్లు రాష్ర్టానికే కాదు.. దేశ ఆరోగ్య వ్యవస్థను కాపాడటంలో కీలకంగా పనిచేస్తారు’ అని ఇటీవల 9 కాలేజీల్లో తరగతులు ప్రారంభించిన సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు అక్షర సత్యం.
50 వేల ప్రభుత్వ పడకలు
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల్లో కనీసం పడకల సంఖ్యను పెంచడంలో నాటి పాలకులు విఫలం అయ్యారు. మూడున్నర కోట్ల మంది ప్రజలకు 17 వేల పడకలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆక్సిజన్ పడకలు 1,400 మాత్రమే. అంటే 8 శాతమే. అంటే వందలో 8 పడకలకే ఆక్సిజన్ సరఫరా ఉండేది. అంతకన్నా ఎక్కువ మందికి ఆక్సిజన్ అవసరమైతే దేవునిపై భారం వేయాల్సిందే. ఇక అత్యవసర సేవలు అందించే ఐసీయూలు, బ్లడ్ బ్యాంకులు వంటివాటి గణాంకాలు ఇంకా దారుణంగా ఉండేవి. ఈ దుస్థితిని సీఎం కేసీఆర్ సమూలంగా మార్చేశారు. పడకల సంఖ్య డబుల్ చేయడమే కాదు.. అన్నింటినీ ఆక్సిజన్ పడకలుగా మార్చేశారు. ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న టిమ్స్, వరంగల్ హెల్త్ సిటీ, నిమ్స్ విస్తరణ, దవాఖానల అప్గ్రేడేషన్ వంటివన్నీ కలిపితే రాష్ట్రంలోని పడకల సంఖ్య 50 వేలకు చేరనున్నది.
నియోజకవర్గానికో డయాలసిస్ కేంద్రం
కిడ్నీ సమస్యలు ఉన్నవారు యాలసిస్ చేయించుకోవటం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉస్మానియా, గాంధీ, నిమ్స్లోనే ఉచిత డయాలసిస్ సెంటర్లు ఉండేవి. ప్రైవేట్లో చేయించుకోలేని రోగులు దూర ప్రాంతాల నుంచి వచ్చి అవస్థలు పడేవారు. దీంతో ప్రతి నియోజకవర్గానికి ఉచిత డయాలసిస్ కేంద్రం ఉండాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం 10 వేల మంది ఉచితంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరికి పింఛను, ఉచిత బస్పాస్ సౌకర్యం కల్పిస్తున్నారు. అత్యవసర సమయాల్లో రక్తం అందించేందుకు ప్రభుత్వం బ్లడ్బ్యాంకులను గణనీయంగా పెంచింది.
‘వాహన’ సేవలోనూ ఆదర్శం
అత్యవసర సమయాల్లో ప్రతి క్షణం విలువైనదే. ఎంత వేగంగా దవాఖానకు చేరుతామనేదానిపైనే కోలుకునే అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ప్రభుత్వం అంబులెన్స్ల సంఖ్యను పెంచడంతోపాటు కొత్త వాహనాలను సమకూర్చింది. గర్భిణుల కోసం సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రత్యేకంగా అమ్మ ఒడి వాహనాలను 2017-18లో ప్రారంభించారు. పార్థివ దేహాలను తరలించేందుకు ‘హర్సె’ వాహనాలను 2016-17లో ప్రవేశపెట్టారు. ఈ మూడు రకాల వాహనాలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకు 1.03 కోట్ల మంది వీటి ద్వారా లబ్ధిపొందారు. ఇటీవలే సీఎం కేసీఆర్ 466 కొత్త వాహనాలను ప్రారంభించారు. మానవీయ కోణంలో ప్రారంభించిన అమ్మ ఒడి, హర్సే వాహనాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
అమ్మకు అండ.. బిడ్డకు భరోసా
పదేండ్లలో రాష్ట్రంలో చేపట్టిన మాతాశిశు సంరక్షణ చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యి శిశువుకు వ్యాక్సిన్లు పూర్తయ్యే వరకు పటిష్ఠ కార్యాచరణ అమలవుతున్నది. గర్భం దాల్చగానే ప్రతి ఒక్కరు ‘కేసీఆర్ కిట్’లో పేరు నమోదు చేయించుకుంటున్నారు. అప్పటి నుంచి ఆశాలు, ఏఎన్ఎంల ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతున్నది. ప్రభుత్వం నుంచి దశలవారీగా ఆర్థిక సాయం అందుతున్నది. ఆరోగ్యలక్ష్మితో వారికి అంగన్వాడీల ద్వారా పోషకాహారం అందిస్తూనే, పోషకాల లోపాన్ని నివారించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ను అందిస్తున్నారు. చెకప్లు, ప్రసవం తర్వాత అమ్మ ఒడి వాహనాల్లో సురక్షితంగా దవాఖానలు, ఇండ్లకు చేర్చుతున్నారు. కేసీఆర్ కిట్తో సుమారు 14 లక్షల మంది గర్భిణులు ప్రయోజనం పొందితే, 6.5 లక్షల మంది గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందింది. మరోవైపు గర్భిణుల్లో భరోసా పెంచేందుకు దవాఖానల్లో వైద్యసిబ్బందిని నియమించటంతోపాటు లేబర్ రూంల ఆధునీకరణ, అన్నిరకాల సదుపాయాల కల్పన, మిడ్ వైఫరీ వ్యవస్థ వంటివి ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిశు సంరక్షణ యూనిట్లు (డీపీసీయూ), ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ యూనిట్లు (ఎస్ఎన్సీయూ), మాతాశిశు సంరక్షణ కేంద్రాలు (ఎంసీహెచ్), నియోనాటల్ అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా రాష్ట్రంలో మాతాశిశు సంరక్షణ సేవల్లో అద్భుత ఫలితాలు నమోదయ్యాయి. మాతృ మరణాలు (ఎంఎంఆర్), శిశు మరణాలు(ఐఎంఆర్) తగ్గిపోయాయి.
5 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు
సూపర్ స్పెషాలిటీ సేవలంటే ఇప్పటికీ గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలే దిక్కు. దీంతో ఆయా దవాఖానలపై ఒత్తిడి విపరీతంగా పెరిగింది. దీంతో సూపర్ స్పెషాలిటీ సేవలను పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ నలువైపులా అల్వాల్, గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్నగర్లో టిమ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. వీటికితోడు వరంగల్ హెల్త్ సిటీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తున్నారు. నిమ్స్లో అదనంగా 2,000 సూపర్ స్పెషాలిటీ పడకలను విస్తరిస్తున్నారు. వీటన్నింటికీ గత ఏడాది సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ పనులు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా 8 వేలకుపైగా సూపర్ స్పెషాలిటీ పడకలు అందుబాటులోకి వస్తాయి.
బస్తీ, పల్లె దవాఖానలు
పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు చిన్న చిన్న వ్యాధులు వస్తే సమీపంలో దవాఖానలు లేక ప్రైవేట్ను ఆశ్రయించేవారు. డబ్బు ఖర్చు చేసుకునేవారు. పల్లెల్లోనూ ఆర్ఎంపీలపై ఎక్కువగా ఆధారపడేవారు. దీంతో డబ్బు ఖర్చుతోపాటు పొరబాట్లతో ప్రాణాలు కోల్పోయేవారు. ఈ పరిస్థితిని మార్చేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానలు, పల్లె దవాఖానలకు రూపకల్పన చేశారు. హైదరాబాద్లో 350, ఇతర మున్సిపాలిటీల్లో 150 కలిపి 500 బస్తీ దవాఖానలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. పల్లెల్లో వైద్య సేవల మెరుగుకు 3 వేలకుపైగా పల్లె దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది.
హెల్త్ ఇండెక్స్లో అగ్రస్థానం
దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్యారోగ్య రంగం పనితీరును విశ్లేషిస్తూ నీతి ఆయోగ్-2021లో ‘హెల్త్ ఇండెక్స్’ను విడుదల చేసింది. ఇందులో ఓవరాల్ ర్యాంకింగ్స్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. పురోగతిలో మొదటి స్థానంలో నిలిచింది. పిల్లలకు వ్యాక్సినేషన్, దవాఖాన ప్రసవాల పురోగతిలో దేశంలోనే టాప్లో నిలిచింది. నివేదిక రూపకల్పనలో భాగంగా నీతి ఆయోగ్ 24 అంశాలను పరిగణనలోకి తీసుకున్నది. శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వంటి పోర్టళ్ల ద్వారా సమాచారాన్ని సేకరించింది. 2019-20లో వైద్యారోగ్యరంగంలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ర్టాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.
ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు
కంటివెలుగు: 2018లో నిర్వహించిన మొదటి విడత కంటివెలుగులో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది నిర్వహించిన రెండో విడుతలో 1.65 కోట్ల మందికి కంటి పరీక్షలు జరిగాయి. ఎన్సీడీ కిట్లు: రోగాలను ముందుగా గుర్తించి, చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఎన్సీడీ స్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. గత ఏడాది చివరి నాటికి 1.48 కోట్ల మందికి స్రీనింగ్ చేయగా, ఇందులో 17.36 లక్షల మందికి బీపీ, 8.86 లక్షల మందికి షుగర్ వ్యాధి ఉన్నట్టు గుర్తించింది. వారందరికీ ఉచితంగా ప్రభుత్వం మందుల కిట్లను ఇంటికే పంపిణీ చేస్తున్నది. జిల్లా, సీహెచ్సీల్లో ఎస్సీడీ క్లినిక్స్ ఏర్పాటు చేసింది.
ఆరోగ్య మహిళ: మహిళలు ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో ఈ ఏడాది మార్చి 8 నుంచి ‘ఆరోగ్య మహిళ’ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి మంగళవారం మహిళలకే 8 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
టీ డయాగ్నస్టిక్స్: పీహెచ్సీలు మొదలు అన్ని దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నది.