హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని పౌరసరపరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. మంగళవారం ధాన్యం కొనుగోలుపై అధికారులు, మిల్లర్లతో పౌరసరఫరాల భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకొనిరావాలని రైతులను కోరారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టంచేశారు. ధాన్యంలో తరుగు తీయవద్దని రైస్ మిల్లర్లను ఆదేశించారు. తరుగుపై ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో సమస్యలు లేవని, అవన్నీ రాజకీయ నిరుద్యోగుల విమర్శలేనని కొట్టిపారేశారు. సరిపడా గన్నీ సంచులు, ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఇతర సౌకర్యాలను సమకూర్చినట్టు తెలిపారు. కేంద్రం కొత్త గన్నీ బ్యాగులు మంజూరు చేయకపోయినా ఇతర మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చుకున్నదని తెలిపారు. సోమవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,257 కొనుగోలు కేంద్రాల ద్వారా రూ.3,634 కోట్ల విలువైన 19 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. 204 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని వివరించారు.
బడుగు, బలహీనవర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండ
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి పెంబర్తి శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చింతల శ్రీనివాస్ తదితరులు మంత్రి గంగుల కమలాకర్ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం క్షౌరశాలలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందివ్వటమే కాకుండా రాష్ట్ర రాజధానిలో నాయీ బ్రాహ్మణ సమాజానికి ఆత్మగౌరవ భవనం నిర్మిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. నాయీ బ్రాహ్మణ ఆత్మగౌరవ భవన నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. అన్ని కులాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతకాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.