హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) పేర్కొన్నారు. మంగళవారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ధాన్యం కొనుగోళ్లపై( Grain Procurement)పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్తో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 38.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. ఇది గత సీజన్ కన్నా 10 లక్షల మెట్రిక్ టన్నులు అధికమని వివరించారు.
కేంద్ర సహకారం ఆశించినంత లేకున్నా యాసంగి ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో సేకరిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7వేల కొనుగోలు కేంద్రాల ద్వారా 7907 కోట్ల విలువ గల ధాన్యాన్ని 6లక్షల 5వేల మంది రైతుల నుంచి సేకరించామని వెల్లడించారు. కొన్ని రోజులుగా సరాసరి రోజుకు లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు. ధాన్యం సేకరణ పూర్తయిన 400 కేంద్రాలను మూసేసామని తెలిపారు.
ఎఫ్సీఐ(FCI) నిర్దేశించిన కనీస నాణ్యతా ప్రమాణాలను రైతులు పాటిస్తే ఇబ్బందులు ఉండవని చెప్పారు. కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులను(Basic needs) ఏర్పాటు చేశామని, సమస్యలున్న చోట అధికార యంత్రాంగం తక్షణమే స్పందిస్తుందని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఇదే అంశంపై బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్(Video Conference) నిర్వహించి సమస్యలను మరింత వేగంగా పరిష్కరిస్తామన్నారు.