హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తుందని, రేషన్ డీలర్ల సంక్షేమం కోసం సైతం తీవ్రంగా కృషి చేస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ చీఫ్ విఫ్ దాస్యం వినయ్ బాస్కర్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, రేషన్ డీలర్ల గౌరవాధ్యక్షుడు దేవేందర్ రెడ్డితో కలిసి రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులతో బేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014కు ముందు కేవలం టన్నుకు 200రూ. మాత్రమే ఉన్న కమీషన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో 900 రూపాయలకు పెంచడంతో పాటు అనేక సంక్షేమ చర్యలు తీసుకున్నారని మంత్రి తెలియజేసారు. ఈ సందర్భంగా డీలర్ల సంఘం ప్రతినిధులు మంత్రి ద్రుష్టికి తమ సమస్యలు తీసుకొచ్చారు.
రేషన్ పోర్టబులిటీ ఇతరత్రా కారణాలతో గ్రామీణ ప్రాంతాల్లోని రేషన్ డీలర్లు గణనీయంగా ఆదాయం కోల్పోయారని, వారికి గౌరవ ప్రదమైన కమిషన్ వచ్చేలా చేయాలని కోరారు. దీంతో గ్రామీణ, మున్సిపల్, కార్పొరేషన్ పరిధుల్లోని రేషన్ డీలర్లకు సమన్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి గంగుల వారితో పేర్కొన్నారు. అలాగే రేషన్ డీలర్ల సమస్యలపై కూలంకషంగా చర్చించి వారి అంశాలను సీఎం కేసీఆర్ ద్రుష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా మంత్రి హామీనిచ్చారు.