కరీంనగర్ : గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) బడు, బలహీన వర్గాల వ్యతిరేకి అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula )అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినెట్ చేసిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బీసీ వర్గానికి చెందిన దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం పట్ల మంత్రి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బుధవారం కరీంనగర్లో జరిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో మంత్రి గంగుల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గవర్నర్ తమిళసై బడుగు, వర్గాల గురించి అనుసరిస్తున్న విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఆమె భావజాలమా అని ప్రశ్నించారు. గరవర్నర్ పోస్టుకు తనను నామినేట్ చేసింది బీజేపీయే కదా అని, అప్పుడు ఆమె నేపథ్యం చూడ లేదు కదా అని అన్నారు.
గవర్నర్ తీరుతో బడుగు బలహీన వర్గాలు చాలా హర్ట్ అయ్యారని, ఇప్పటికైనా గవర్నర్ రాజకీయాలు చేయకుండా వారి ప్రతిపాదనలు ఆమోదించాలన్నారు. పౌర సరఫరాల విషయంలో కేవైసీ గురించి మాట్లాడుతూ.. ఈ నెల 30 వరకు గడువు ఇచ్చారని అన్నారు. పదేళ్లకోసారి ఆధార్ కార్డ్ అప్ డేట్ చేస్తారని, ఈ విషయంలో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు రాష్ట్ర ప్రభుత్వం తరపునా లేఖ రాసామని, మంత్రి స్పందన ఎలా ఉంటుందో చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎవరు ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గోపి, తదితరులు పాల్గొన్నారు.