కరీంనగర్: చదువే అన్నిటికీ మూలం అని, విద్య ఉంటేనే సమాజంలో గౌరవించబడతామని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చింతకుంట మండల కేంద్రంలోనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా రూ. 27.24 లక్షలతో పాఠశాల మౌలిక వసతుల అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో గంగుల మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు వసతులు లేక పేద విద్యార్థులు చాలా మంది చదువుకు దూరం అయ్యారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎవరు కూడా విద్యకు దూరం కావొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేశారని అన్నారు.
ఇక జిల్లాలో మొదటి విడత మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా సూమారు 230 పాఠశాలలను రూ. 92 కోట్లతో ఆధునీకరణ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆధునీకరణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రతి నిరుపేద విద్యార్థి కూడా ఉన్నత విద్య చదవాలని ఆలోచించిన వ్యక్తి కేసీఆర్ అని గంగుల పేర్కొన్నారు.
దేశంలో కేజీ టూ పీజీ విద్య అందించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. విద్య, వైద్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిక్షణం పరితపిస్తున్నారని అన్నారు. ప్రైవేటు సీట్లు కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో, గురుకులాల్లో సీట్లు కావాలని నా వెంట పడుతున్నారనీ.. ఈ పరిస్థితి కేసీఆర్ కల్పించారనీ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు, జేడ్పిటిసి పిట్టల కరుణ, నగర్ మేయర్ సునీల్ రావు, ఎంపీటీసీలు తిరుపతి నాయక్, పట్టెం శారద – లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.