కరీంనగర్ : తెలంగాణ సాధన కోసం తన మంత్రి పదవిని సైతం త్యజించిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. 90 సంవత్సరాల వయసులో తెలంగాణ సాధన కోసం గడ్డకట్టే చలిలో ఢిల్లీలో ఉద్యమం చేసిన ఘనత ఆయనది. ఆ మహనీయుడి సేవలు తెలంగాణకే గర్వకారణమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)అన్నారు.
భారత స్వాతంత్ర పోరాట, తెలంగాణ ఉద్యమ నేత, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) వర్ధంతి సందర్భంగా మంత్రి కరీంనగర్లోని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవల్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితాంతం బలహీన వర్గాల కోసం సేవ చేసిన ఘనత ఆయనదని ప్రశంసించారు.
ఆయనతో పాటు తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొనడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను ఆయన కండ్లతో చూడకపోవడం బాధాకరమన్నారు. బాపూజీని గౌరవిం చుకుంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టేనని తెలిపారు. అందులో భాగంగా ️ తెలంగాణ ప్రభుత్వం బాపూజీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుందని గుర్తు చేశారు.
హైదరాబాద్లో ట్యాంక్ బండ్తో పాటు జిల్లా కేంద్రాల్లో విగ్రహాలను ఏర్పాటు చేసి ఆయన చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఆ మహనీయుడి ఆశయాల సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. గాలి, నీరు ఉన్నంత వరకు కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక్క కులానికో.. మతానికో చెందిన వారు కాదని, ఆయన యావత్ తెలంగాణకే ఆస్తి అని అన్నారు.