కరీంనగర్ : భారీ వర్షాలతో కరీంనగర్ పట్టణం జలమయం అయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మేయర్ సునీల్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వరద నీటిని బయటకు పంపేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి కమలాకర్ స్పష్టం చేశారు.
మంగళవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 15.31 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదు అయ్యింది. జిల్లాలోని మానేరు, మోయతుమ్మెద, చిలుక, శంకరపట్నం, ఇరుకుల్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. అనేక గ్రామాల్లో ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. చెరువులు, కుంటల్లోకి భారీ వరద వచ్చి చేరుతోంది. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. పలు మండలాల్లో పంట పొలాలు నీట మునిగి గాయి. భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం సెలవు ప్రకటించారు.