హైదరాబాద్ : ఐటీ, ఈడీ సంస్థల దర్యాప్తునకు సంపూర్ణ సహకారం అందిస్తానని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నిజనిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదే అని మంత్రి పేర్కొన్నారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులకు ఇంటి తాళాలు తీయమని చెప్పింది తానే అని తెలిపారు. ఇంట్లోని ప్రతి లాకర్ను ఓపెన్ చేసి చూసుకోమని చెప్పారు. సోదాల్లో ఎంత క్యాష్ దొరికిందో, ఏం స్వాధీనం చేసుకున్నారో ఈడీ, ఐటీ అధికారులే చెప్పాలన్నారు.
మైనింగ్, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి అని తెలిపారు. బయటి దేశాల నుంచి డబ్బులు హవాలా మార్గంలో తెచ్చామా అనేది ఈడీ, డబ్బులు అక్రమంగా నిల్వ ఉంచామా అనేది ఐటీ చూస్తోందన్నారు. ఈ రెండింటికి సంబంధించి తమ సంస్థల్లో ఎలాంటివి జరగలేదన్నారు. గతంలో చాలాసార్లు.. చాలా మంది ఈడీ, ఐటీలకు ఫిర్యాదు చేశారు. తాము స్వాగతించామని గుర్తు చేశారు. తాము పారదర్శకంగా, ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం చేసుకుంటున్నామని చెప్పారు. ఈ సమయంలో దగ్గరుండి దర్యాప్తునకు సహకరించాలనే ఉద్దేశంతోనే దుబాయ్ నుంచి వెంటనే వచ్చానని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.