కరీంనగర్: పదోతరగతి పేపర్ లీక్ (Paper Leak) వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) కీలక సూత్రధారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalaker) విమర్శించారు. రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేండ్లలో అనేక రకాల పరీక్షలు జరిగాయని, ఎప్పుడూ లీక్ కాని పేపర్లు ఇప్పుడే ఎందుకవుతున్నాయో అర్థం చేసుకోవాలన్నారు. కరీంనగర్లో (Karimnagar) పార్టీ నాయకులతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. కేవలం రానున్న ఎన్నికల్లో ఎలాగైనా లబ్ధిపొందాలన్న కుట్రలో భాగంగా బీజేపీ (BJP) ఆడుతున్న డ్రామాల్లో ఒక భాగం పేపర్లీకేజీ అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మంచి పేరును చెడగొట్టేందుకు బీజేపీ అధ్యక్షుడు సంజయ్ అనేక అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. బీహార్లో (Bihar) ఉన్న సంస్కృతిని ఇక్కడ తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
టీఎస్పీఎస్సీ (TSPSC) లీకుల్లోనూ బండి సంజయ్ అనుచరలే ఉన్నారని చెప్పారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ చేసింది కూడా ఆయనకు చెందిన వారేనని దీనిని బట్టి అర్థంచేసుకోవచ్చన్నారు. తన రాజకీయాలకోసం వేలాది మంది యువత, విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. పదో తరగతి పేపర్ లీకేజీ విషయం తెలియగానే.. ఒక బాధ్యత గల ఎంపీ ముందుగా ప్రభుత్వానికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. కానీ అలా చేయకుండా మొత్తం బీజేపీ గ్రూపుల్లో షేర్ చేయడం వెనుక పెద్దకుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తంచేశారు. పేపర్ లీకేజీ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు..? భవిష్యత్లో జరగబోయే పేపర్ లీకేజీలకు ఎమైనా కుట్రలు పన్నారా..? అనే వివరాలను ఒకటి రెండురోజుల్లో బయట పెడుతామన్నారు. ఇది ముమ్మాటికీ వందశాతం ముందస్తు ప్రణాళిక ప్రకారం సంజయ్ చేసిన దుశ్చర్చేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.