కరీంనగర్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar), మాజీ ఉపప్రధాని బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan ram) జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుందామని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. ఈ నెల 5న జగ్జీవన్ రామ్, 14న అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఉత్సవాల నిర్వహణపై కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో అధికారులు, వివిధ సంఘాల నాయకులతో మంత్రి గంగుల కమలాకర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇద్దరు నేతల జయంతి ఉత్సవాలను పండుగలా జరిగేలా ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు.
బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతి కోసమే కాకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పని చేసిన మహనీయులని కొనియాడారు. భావితరాలకు ఈ మహనీయుల జీవిత చరిత్ర తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. వారు చూపినదారి మనందరికీ అనుసరణీయమని తెలిపారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.