కరీంనగర్, నవంబర్ 4 (నమస్తేతెలంగాణ): దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలో పంట పండిందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్, చామన్పల్లి, చెర్లభూత్కూర్, దుర్షేడు గ్రామాల్లో శుక్రవారం మంత్రి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులనుద్దేశించి ప్రసంగించడంతోపాటు నగునూర్లో మీడియాతో మాట్లాడారు. 2014కు ముందు రాష్ట్రంలో ప్రతి సీజన్లో 25 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు లక్ష్యంగా ఉండేదని, ఈ వానకాలంలో కోటి టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించడం రాష్ర్టానికే గర్వకారణమన్నారు. సాగుకు ప్రోత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా పండిన ప్రతి గింజను సీఎం కేసీఆర్ సారథ్యంలో కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 6,713 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇప్పటికే 1,545 కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే 6,313 మంది రైతుల నుంచి రూ.100 కోట్ల విలువైన 50 వేల టన్నుల ధాన్యం సేకరించినట్టు మంత్రి గంగుల స్పష్టం చేశారు. సాధారణ రకం క్వింటాల్కు రూ. 2,040, ఏ-గ్రే డు రకానికి రూ. 2,060 మద్దతు ధర చెల్లిస్తున్నామన్నారు. రైతుల నుంచి పంట సేకరణను నిర్లక్ష్యం చేయడం వల్లే కేంద్రంలో ఆహార కొరత ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఎఫ్సీఐ వంటి సంస్థలను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుని ఆహార భద్రతను గాలికి వదిలి, పంట కొనుగోళ్లను ఒక వ్యాపారంలా చూస్తున్నదని ధ్వజమెత్తారు. ర్యాక్ల మూవ్మెంట్ ఇవ్వకుండా, గోదాములు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో కొనుగోళ్లను అడ్డుకుంటున్నదని దుయ్యబట్టారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని, ప్రతిపక్ష పార్టీల నాయకులు కల్లాల వద్దకు వెళ్లి రాజకీయాలు చేయవద్దని గంగుల విజ్ఞప్తి చేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పాల్గొన్నారు.