హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని మోదీ సరార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ జాగృతికి ప్రతీకైన కల్వకుంట్ల కవితను విచారణ పేరుతో వేధింపులకు గురిచేయడం మోదీ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీచేయడాన్ని ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.
బేటీ బచావ్, బేటీ పడావ్ అంటే ఇదేనా.. మోదీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నిలదీశారు. మహిళల తరపున పనిచేస్తున్న కవితను వేధించడం సబబేనా అని ప్రశ్నించారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వంపై రాజకీయ కుట్రతో దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పడం నీచమని మండిపడ్డారు. నిరంకుశ చర్యలు మానుకోకపోతే తెలంగాణ సమాజం తన తెగువేంటో చాటిచెబుతుందని హెచ్చరించారు. ఈ ఉడుత బెదిరింపులకు తెలంగాణ భయపడదని, కడిగిన ముత్యంలా బయటకొస్తుందని తెలిపారు.