కరీంనగర్ : గత ఎన్నికల్లో తన భార్య పుస్తెలు అమ్మి పోటీ చేశానని చెప్పుకున్న బండి సంజయ్(Bandi Sanjay)కు నేడు కోట్ల రూపాయలు ఎక్కడ నుండి వచ్చాయని, అవినీతి పరుడివి కాకుంటే నిన్ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్( Minister Gangula) అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం ధుర్షెడ్, ఇరుకుళ్ల గ్రామాలలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు డప్పు చప్పుళ్లతో గంగులకు ఘన స్వాగతం పలుకగా మంత్రి ఇంటింటికి తిరుగుతూ ఓటు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అధ్యక్ష పదవి ఇస్తే కోట్ల రూపాయలు వసూళ్లు చేసి నేడు ఓటుకు ఇరవై వేలు ఇచ్చి గెలిచేందుకు చూస్తున్నాడని మండిపడ్డారు. మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని మాయం అయ్యే వ్యక్తి బండి సంజయ్ అని, ఎంపీగా గెలిచికా నాలుగున్నరేళ్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్ను ఓడించేందుకు దొంగలంతా ఏకమయ్యారని, కేసీఆర్ ఓడిస్తే మళ్లీ ఆంధ్రోళ్ల పాలన వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్ద దొంగ అని, ఆయనకు ఓటేస్తే మీ భూములు మాయం చేస్తాడని హెచ్చరించారు. ఆంధ్రా నాయకులు బీజేపీ, కాంగ్రెస్ రూపంలో ఒక్కటయ్యారు. వాళ్లని నమ్మి ఓటు వేస్తే తెలంగాణలో మళ్లీ కరెంటు కోతలతో చీకట్లేనని అన్నారు. ఓటు పవిత్రమైనదని ఒక్క ఓటు తప్పు జరిగితే యాభై ఏళ్ల దరిద్రం చూడల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి బీఆర్ఎస్కు ఓటు వేసి తెలంగాణను కాపాడుకోవాలని కోరారు.