కలెక్టరేట్, సెప్టెంబర్ 4 : తెలంగాణ రాష్ట్రం రాకుంటే మరో బీహార్లా మారి, వలసలతో వల్లకాడు అయ్యేదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లోని ఆడిటోరియంలో 174 మంది ముస్లిం మైనార్టీలకు వందశాతం సబ్సిడీతో రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం రెవెన్యూ గార్డెన్స్లో పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఎస్ఎస్, అలింకో సంస్థల సౌజన్యంతో దివ్యాంగులకు ఉచిత ఉపకరణాల పంపిణీని ప్రారంభించి, పలువురికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం వివక్షకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కరువు కాటకాలు విలయతాండవం చేయగా, ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేని దుస్థితి నెలకొని ఉండేదన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనతో సస్యశ్యామలంగా మారిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అమెజాన్, గుగూల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తుండగా, యువతకు తెలంగాణ రాష్ట్రం ఉపాధి హబ్గా మారబోతున్నదన్నారు.
సీమాంధ్ర పాలకుల తీరుతో 2014కు ముందు ముస్లింల పరిస్థితి కడుదయనీంగా ఉండేదని, సీఎం కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తున్నారని తెలిపారు. మైనార్టీల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించటంతోనే ఇది సాధ్యమైందన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలు ప్రతి ముస్లిం కుటుంబానికి అందేలా చొరవ చూపడంతో అనతికాలంలోనే వారి జీవన పరిస్థితుల్లో పెనుమార్పులు జరిగాయన్నారు. దీనిని జీర్ణించుకోలేని కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
హిందూ, ముస్లింల మద్య గొడవలు సృష్టించేందుకు కొన్ని పార్టీల నాయకులు అలుపెరుగకుండా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వారి కుయుక్తులను ఎప్పటికప్పుడు పసిగడుతున్న సీఎం కేసీఆర్ వాటి ఆటలకు ముకుతాడు వేస్తున్నారని చెప్పారు. పదేళ్ల పాలనలో ఎక్కడ కూడా హిందూ, ముస్లింల మధ్య గొడవలు జరిగిన దాఖలాలు లేవని, 144వ సెక్షన్లు, ర్యాలీలు, రాస్తారోకోలు లేవన్నారు. ప్రశాంత వాతావ రణంలో రాష్ట్రం ముందుకు సాగుతుందన్నారు.
రాజకీయ అవసరాలు వీడి తెలంగాణ పిల్లల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. ఈ సందర్భంగా 350 మంది ముస్లిం మహిళలకు స్వయం ఉపాధి పథకంలో భాగంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కలెక్టర్ డాక్టర్ బీ గోపి, మేయర్ వై సునీల్రావు, తదితరులు పాల్గొన్నారు.