హైదరాబాద్ : యాసంగి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula)తెలిపారు. గతేడాది ఇదే సమయానికన్నా రెట్టింపును మించి కొనుగోళ్లు చేశామని ఆయన వెల్లడించారు. శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్ లో పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, సంస్థ జీఎం రాజారెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ధాన్యం కొనుగోళ్ల(Grain purchase)పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది ఇదే రోజు 1.90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా రెండున్నర రెట్లు అధికంగా నేడు 5.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ధాన్యం వచ్చిన కొనుగోలుకు వీలుగా 7142 కొనుగోలు కేంద్రాల(Centers)ను సైతం ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే 4వేలకు పైగా కేంద్రాలను ప్రారంభించామన్నారు. రోజుకు 90వేల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరణ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతుందన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో వర్షాల నుంచి రక్షణగా టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ప్యాడీ క్లీనర్లు (Paddy Cleaners) సైతం 6,055, వెయింగ్ మిషన్లు 12,671, ఇతరత్రా మౌలిక సదుపాయాలనూ కల్పించామన్నారు. రైతులకు సీఎం కేసీఆర్(CM KCR) ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, యాసంగిలో అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రైతులకు భరోసా కల్పించి కేంద్రం నుంచి బాయిల్డ్ రైస్ కు సానుకూలంగా నిర్ణయం ఇప్పించాలని సూచించారు, తడిసిన ధాన్యం విషయంలో కేంద్రం సహకరించకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.