కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతి, సంక్షేమానికి పాటుపడుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు. కరీంనగర్ పట్టణం రాంనగర్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని మంత్రి ఆదివారం దర్శించుకున్నారు. ముదిరాజ్ కులస్తుల విజ్ఞప్తి మేరకు అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి మంత్రి రూ.30 లక్షలను మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కుల వృత్తులకు సీఎం కేసీఆర్(CM KCR) జీవం పోశారని కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అన్ని కులాల ఆత్మగౌరవ భవనాలకు ప్రభుత్వ నిధులతో పాటు హైదరాబాద్ నడి బొడ్డున ఖరీదైన స్థలాలు మంజూరు చేసిందని గుర్తు చేశారు. కరీంనగర్ రామ్ నగర్లోని ముదిరాజ్ కులస్తుల ఆత్మగౌరవ భవనానికి రూ. 30 లక్షలు మంజూరు చేసినట్టు ఆయన వెల్లడించారు.
గత పాలకుల నిర్లక్ష్యంతో కరీంనగర్ అభివృద్ధి(Development)లో వెనుకబడిందని ఆరోపించారు. 9 ఏండ్ల తెలంగాణ పాలనలో కరీంనగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. కరీంనగర్లో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ లో తీగల వంతెన(Cable Bridge) , మానేర్ రివర్ ఫ్రంట్(Maneru River Front) వంటి ప్రాజెక్టులు పూర్తయితే కరీంనగర్లో పర్యాటక(Tourism) శోభ సంతరించుకుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు పెంట సత్యం, వరాల నారాయణ , నాయకులు కొట్టే మల్లేశం పలువురు ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు .