హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల కులవృత్తులను కాపాడి వారిని మరింత బలోపేతం చేసే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన బీసీ కులవృత్తుల లక్ష ఆర్థిక సహాయం(Financial assistance ) నిరంతర ప్రక్రియని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) వెల్లడించారు. గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో కరీంనగర్ కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) లో మంత్రి మాట్లాడారు.
ఈ నెల 15 వ తేదీన నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన దాదాపు 300 మంది లబ్ధిదారులకు పథకం గ్రౌండింగ్ కొనసాగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేసే ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికార యంత్రాంగం పాల్గొంటారని పేర్కొన్నారు. బీసీ కులవృత్తుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ జిల్లా స్థాయి యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్లకు సూచించారు.
బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రావెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన వేగవంతంగా కొనసాగుతుందని వివరించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న కులవృత్తిదారులను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారికి లక్ష రూపాయల తోడ్పాటును అందిస్తుందన్నారు. తిరిగి చెల్లించవలసిన అవసరం లేకుండా వారి వృత్తికి సంబంధించి పనిముట్లు, ముడిపదార్థాలు వంటివి తీసుకునేందుకు ఆర్థిక సాయం ఉపయోగపడుతుందన్నారు.
ప్రతి నెలా 15వ తేదీన లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనుకబడిన వర్గాల అభ్యున్నతీ కోసం తెలంగాణలా కృషి చేయలేదని, సంక్షేమ గురుకులాల ద్వారా నాణ్యమైన విద్య, చేతివృత్తిదారులకు ఆర్థిక తోడ్పాటు, ప్రభుత్వం అమలు చేసే కల్యాణలక్ష్మి, తదితర సంక్షేమ కార్యక్రమంలో బీసీలకు గణనీయ వాటాను ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు.