కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ద్వారా నిరుపేద ఆడబిడ్డలకు అండగా నిలుస్తుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. మంగళవారం హుజురాబాద్ సాయి రూప గార్డెన్లో 500 మంది లబ్ధిదారులకు సుమారు 5 కోట్ల విలువ గల కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డితో కలసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కల్యాణ లక్ష్మి, రైతుబంధు వంటి పథకాలు ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు. పేదింటి ఆడబిడ్డలకు గొప్పవరం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలని అన్నారు. అలాగే ఆసరా పెన్షన్, వృద్ధాప్య పెన్షలను కూడా ప్రవేశపెట్టారని మంత్రి అన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణను సీఎం కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ,జెడ్పీ చైర్మన్ కనమల్ల విజయ ,అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, తదితరులు పాల్గొన్నారు.