కరీంనగర్ కార్పొరేషన్, జూలై 27: అన్నిరంగాల్లో దూసుకెళ్తున్న కరీంనగర్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. బుధవారం కరీంనగర్లోని బొమ్మకల్ గ్రామంలోని యజ్ఞవరాహస్వామి దేవాలయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న రాందేవ్బాబా సేవా సమితి కమ్యూనిటీ భవనాన్ని మేయర్ సునీల్రావుతో కలిసి పరిశీలించారు.
మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద దళితబంధు లబ్ధిదారుకు వాహనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. కమ్యూనిటీ భవన నిర్మాణానికి గతంలోనే రూ.10 లక్షలు మంజూరు చేయగా, ఇప్పుడు మరో రూ.15 లక్షలు కేటాయిస్తున్నట్టు చెప్పారు. దళితబంధుతో దళితులు ఆర్థికంగా మరింత అభివృద్ధి సాధించాలన్నారు. దళారులకు చోటులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు వేస్తున్నామని తెలిపారు.