కరీంనగర్ కార్పొరేషన్ : తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఈ ప్రాంతంలో ఇంత అభివృద్ధి, సంక్షేమం జరిగేదా? అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula)ప్రశ్నించారు. సీఎం కేసీఆర్(CM KCR) లేని తెలంగాణను చూడలేమని, ఊహించను కూడా లేమని పేర్కొన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో(Decade Celebrations) భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రం రేకుర్తిలోని శుభం గార్డెన్లో సంక్షేమ సంబరాలు నిర్వహించారు. బీసీ కులవృత్తులను కాపాడేందుకు చేపట్టిన లక్ష రూపాయల పథకాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించి కరీంనగర్ నియోజకవర్గంలోని పలువురికి చెక్కులను అందించారు.
మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు దేశంలో 75 ఏళ్లలో ఎన్నో ప్రభుత్వాలు, సీఎంలు, పీఎంలు మారారు తప్ప తెలంగాణ ప్రజల బతుకులు, జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. సమైక్యపాలకులు తెలంగాణ వనరులు, సంపదపై దాడులు చేసి కొల్లగొట్టారని దుయ్యబట్టారు. ఆంధ్ర పాలనలో మన తాతలు, తండ్రులు సాగునీరు కోసం, తాగునీటి కోసం, కరెంటు కోసం ఎన్నో గోసలు పడ్డారని అలాంటి పరిస్థితి మన పిల్లలకు రావద్దంటే కేసీఆర్ను మరోసారి కొనసాగించాలన్నారు.
మన వనరులు, సంపదను ఇక్కడే ఖర్చు చేయడం వల్లే ఇంత అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతున్నామని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ 60 ఏళ్లు ఏలిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వస్తున్నాయని, వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలంగాణ సంపదను మరోసారి తరలించుకుపోయే ప్రమాదం ఉందని, మళ్లీ పాత రోజులే పునరావృతం అవుతాయని హెచ్చరించారు. కరీంనగర్ అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ రూ.2000 కోట్ల నిధులను మంజూరు చేశారని, వాటితో నగరాన్ని, నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. ప్రజలందరూ సంక్షేమం, అభివృద్ధి, కోసం బీఆర్ఎస్కు ఓటేయాలని, భవిష్యత్తు తరాలను బాగు చేయాలని సూచించారు.
చెక్కులు పంపిణీ..
సంక్షేమ సంబురాల సందర్భంగా మంత్రి గంగుల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 104 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి(Kalyanalaxmi), షాదీముబారక్(Shadi mubarak) చెక్కులను , రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా 126 గొర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. తొమ్మిది మంది రజక, నాయీబ్రాహ్మణ, అవుసలి, వడ్రంగి,చాకలి,ఆరెకటిక కుటుంబాలకు రూ. లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, ఎంపీపీలు పిల్లి శ్రీలత, తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు.. గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెడ్డవేని మధు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, ఆర్డీవో ఆనంద్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారి రాజ మనోహర్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.