కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు పల్లె, బస్తీ దవాఖానాలు ఏర్పాటుచేసిందని రాష్ట్ర బీసీసంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) తెలిపారు.శుక్రవారం కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లి గ్రామం 1వ డివిజన్ లో బస్తీ దవాఖాన(Basti Hospital), పల్లె దవాఖానాలను జిల్లా ప్రధాన ఆసుపత్రిలో జిల్లా మానసిక ఆరోగ్య చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు.
మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా పక్కా ప్రణాళికతో ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకుందని వెల్లడించారు. ఇందుకోసం ఆసుపత్రులు, వైద్య కళాశాలలను(Medical college) ప్రారంభించుకున్నామని తెలిపారు. కేసీఆర్ కిట్స్(KCR Kits), న్యూట్రిషన్ కిట్స్, భాగ్యలక్ష్మి తదితర పథకాల వల్ల వివిధ ఆరోగ్య సూచీలో తెలంగాణ పురోగతిని సాధించిందన్నారు. ప్రజలకు వైద్యాన్ని మరింత చేరువు చేసేలా 5వేల నుంచి 10వేల లోపు జనాభా గల నాన్ మెట్రో యూఎల్బీలలో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసిందన్నారు.
కరోనా(Corona) సమయంలో వైద్యులు అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాలపై డాక్టర్లు ఎక్కువ శ్రద్ధను కనబరచాలని కోరారు. అంతకుముందు పల్లెదవాఖానాలో మంత్రి, జిల్లా పరిషత్ చైర్మన్ లు వైద్యపరీక్షలను చేయించుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై. సునీల్ రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, వైద్యాఆరోగ్యశాఖ అధికారి లలితాదేవి, మున్సిపల్ కమిషనర్ సేవాఇస్లావత్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.