వరంగల్/హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 13: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే సీఎం రేవంత్రెడ్డి మేడిగడ్డ టూర్కు వెళ్లారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి విమర్శించారు. మంగళవారం వరంగల్ పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ డ్యామేజీ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధికోసం వాడుకుంటున్నదని మండిపడ్డారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల డ్యామేజీపై సమగ్ర విచారణ జరిపించే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ఇంతకుముందే రాహుల్ గాంధీ, మంత్రులతో కలిసి మేడిగడ్డకు వెళ్లిన రేవంత్రెడ్డి ఇప్పుడు మళ్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలని డిమాండ్ చేశారు.అధికారంలోకి రాకముందు సీబీఐ విచారణపై ప్రగల్భాలు పలికిన రేవంత్ ఇప్పుడు నోరెందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.డ్యామ్ సేఫ్టీ అథారిటీ వివరాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని, నిపుణుల కమిటీ బృందంతో మేడిగడ్డ సందర్శనకు వస్తామంటే అనుమతి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు నాటకాలు అడుతున్నాయని మండిపడ్డారు.
మేడిగడ్డ ప్రమాదంలో ఉన్నదని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నెలల కాలం వృథా చేసిందని అన్నారు. విజిలెన్స్ దర్యాప్తు అంటున్న రాష్ట్ర సర్కారు విజిలెన్స్ ఏం చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రాజెక్ట్లపై కేంద్రం పెత్తనం చేలాయిస్తున్నదని తప్పుడు ప్రచారం చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. పోలీసుల పహారాలో ఏపీ కృష్ణా జలాలను తీసుకుపోతుంటే రెండు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర వ్యవహారంపై రాష్ట్ర సర్కారు వైఖరి ఏంటో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నదని ఎద్దేవా చేశారు. సమస్యను రాష్ర్టాలు పరిష్కరించుకుంటే కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. కేంద్రంపై నిందలు వేస్తూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
నెలాఖరులో వేయిస్తంభాల మండపాన్ని ప్రారంభిస్తాం
చారిత్రక వేయిస్తంభాల దేవాలయంలోని కల్యాణ మండపాన్ని వైభవంగా నిర్మిస్తున్నామని, ఈ నెలాఖరులో ఘనంగా పూజలు నిర్వహించి ప్రారంభిస్తామని మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. మండపాన్ని పరిశీలించారు. అక్కడే కల్యాణ మండపం విశేషాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. రామప్ప దేవాలయాన్ని రూ.60 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.3 కోట్లతో వరంగల్ కోటలో సౌండ్ అండ్ లైట్స్ సిస్టమ్ను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. ములుగులో సమ్మక-సారక గిరిజన యూనివర్సిటీ మంజూరు చేశామని, త్వరలోనే ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్టు చెప్పారు. తాతాలికంగా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి ఈ ఏడాది కోర్సులను ప్రారంభిస్తామన్నారు.