Minister KTR | హైదరాబాద్/ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాల పంపిణీపై పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆదివారం నూతన సచివాలయంలో తొలి సంతకం చేయనున్నారు. హైదరాబాద్లో లక్ష మం ది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకం గా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి మంత్రి కేటీఆర్ ఆదివారం అడుగు పెట్టనున్నారు. మూడో అంతస్తులోని తన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించనున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలకమైన ఫైలుపై తొలి సంతకం చేయనున్నారు.
నూతన సచివాలయంలో వ్యవసాయశాఖపై తొలి సమీక్షా సమావేశాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సోమవారం నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు 16 అంశాలతో ఎజెండాను రూపొందించి, వివిధ విభాగాల హెచ్వోడీలకు సమాచారం అందజేశారు. 2023-24 వానకాలం సీజన్కు సంబంధించిన ఏర్పాట్లు, ఎరువులు, విత్తనాల లభ్యత, రైతు వేదికల్లో సమావేశాల నిర్వహణ, వ్యవసాయ యాంత్రీకరణ యాక్షన్ ప్లాన్, యాసంగి మక్కల కొనుగోళ్లు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల పనితీరు తదితర అంశాలను ఎజెండాలో చేర్చారు.