జనగామ : మహిళల్లో ఆర్థిక చైతన్యం పెరిగి, సామాజికంగా గౌరవం దక్కేలా పారిశ్రామికవేత్తలుగా ఎదగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli) అన్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ, ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్వాక్రా ( Dwacra Women) మహిళా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత అప్పటి సీఎం ఎన్టీఆర్కు దక్కితే వాటిని బలోపేతం చేసిన ఘనత సీఎం కేసీఆర్ (CM KCR ) కు దక్కుతుందన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు అన్ని అవకాశాలు కల్పించామని వెల్లడించారు. కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యమని పేర్కొన్నారు. వంద కోట్లతో కొడకండ్లలో టెక్ట్స్టైల్ పార్క్ ( Texttile Park) ను ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు.
తెలంగాణకు చెందిన డ్వాక్రా సంఘాల మహిళలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడ మహిళలను చైతన్య పరిచి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తుండడం అభినందనీయమని అన్నారు. 35 ఏళ్లుగా తనపై నమ్మకంతో గెలిపిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi) ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో, సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా జరగడం లేదని తెలిపారు. వరంగల్ లో రూ.1100 కోట్లతో నిర్మిస్తున్న సూపర్ స్పెషల్ ఆసుపత్రిలో మహిళలకు ప్రత్యేక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని కోరారు.