హైదరాబాద్ : ఏపీలోని విజయవాడలో గల ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ధర్మకర్తలు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికి అమ్మ వారి దర్శనం చేయించారు. వేదపండితులు అమ్మ వారి వస్త్రాలతో సన్మానించి ఆశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..అమ్మ వారిని రెండు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. అమ్మ వారి ఆశీస్సులతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాలు ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నట్లు తెలిపారు. విజయవాడకి ఎప్పుడు వచ్చినా అమ్మవారిని దర్శించుకుంటానని మంత్రి తెలిపారు.
తదనంతరం తన మిత్రుడైన బొంతు శ్రీనివాస్ రెడ్డి తండ్రి బాపి రెడ్డి మరణించగా వారి స్వగ్రామమైన గుంటూరు జిల్లాలో గల కొల్లిపర్ మండలం మున్నంగి గ్రామంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.