మహబూబాబాద్ : విద్యార్థులకు స్వాతంత్య్ర సంగ్రామం, జాతీయ జెండా విషిష్టతను తెలియజేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద 100 అడుగుల జాతీయ జెండాను మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ జిల్లా పరిషత్ స్కూల్ ఆవరణలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భారీ జాతీయ జెండాను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ జాతీయ జెండా 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పుతో దేశభక్తిని చాటేలా రెప రెపలాడుతుందన్నారు. ఈ జాతీయ జెండా కోసం సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు చేశామన్నారు.
డాక్టర్ సోమేశ్వర్ రావు, ఇతర దాతలు కలిసి కమిటీగా ఏర్పడి జాతీయ సమైక్యత కోసం ఈ బృహత్ కార్యాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఇటీవలే సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఘనంగా నిర్వహించుకున్నామన్నారు.
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి ఇప్పటికే మన ఐకమత్యాన్ని చాటాం. మనమంతా ఐక్యతను చాటి మన రాష్ట్ర, దేశ అభివృద్ధిలో పాలుపంచుకుందాం. మన మధ్య విద్వేషాలు పెంచుతున్న అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.