పెద్దవంగర ( మహబూబాబాద్ ): ‘దేశంలోనే తెలంగాణ ధాన్యాగారంగా నిలిచిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli) అన్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని బంగారు చెలిమె తండాలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, సెర్ప్ ఆధ్వర్యంలో అవుతాపురం లో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని కలెక్టర్ శశాంకతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేసీఆర్(CM KCR) ఉద్యమ స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టు( Kaleshwaram Project) నిర్మించి రాష్ట్రాన్ని కోనసీమను తలపించేలా నిరంతరం వాగులు, చెరువులు నింపుతున్నారన్నారు., రైతు సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, రైతు పక్షపాతిగా రూ.16వందలు పలుకుతున్న మక్కల ధరలను రూ.1962 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేసినంత అభివృద్ధి దేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయడం లేదని పేర్నొన్నారు.
బీజేపీవి మత రాజకీయాలు..
బీజేపీ(BJP), కాంగ్రెస్(Congress) పాలిత రాష్ట్రాల్లో రైతులు ఎన్నో కష్టాలు పడుతున్నారని వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెడు తూ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. మహిళా శక్తి అభివృద్ధి తోనే దేశ ప్రగతి సాధ్యమని, ప్రభుత్వం మహిళ సాధికారతే లక్ష్యంగా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఇస్తోందన్నారు.
రాష్ట్రంలోని ప్రతి మహిళ వ్యాపార వేత్తగా, స్వశక్తిగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్షన్నారు. దళితులు(Dalits) అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రత్యేక చర్యలు చేపడుతూ నిధులు అందిస్తున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్, ఎంపీపీ రాజేశ్వరి, జడ్పీటీసీ జ్యోతిర్మయి, పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్, పాలకుర్తి దేవస్థాన, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామచంద్రయ్యశర్మ, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.