వరంగల్ : భారీ వర్షాలతో అన్ని గ్రామాల్లో చెరువులు అలుగు పోస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. గత 5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గ పరిస్థితులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా గ్రామాల పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…అలాగే గ్రామంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని ఆదేశించారు. ఈ సమయంలోనే ప్రజలకు అండగా నిలబడాలని అన్నారు. వరదలతో ఏ సమస్య ఉన్నా, అధికారుల దృష్టికి, తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.
ఏ సమస్య వున్నప్పటికీ తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెద్ద వంగర మండలం పోచంపల్లి ఘటన బాధాకరమని, అన్నదమ్ములు వరదలో కొట్టుకుపోయి చనిపోవడం తనను తీవ్రంగా కలచివేసింది అన్నారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియచేశారు. వారి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.