మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ది రైతు సంక్షేమ ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని తొర్రూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
గుర్తూరులో ఆకేరు వాగుపై చెక్ డాం నిర్మాణానికి శంకుస్థాపన, గుర్తూరు – ఎర్రబెల్లి గూడెం రోడ్డులో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన, గ్రామంలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తాగునీరు, సాగునీరు సమృద్ధిగా అందజేశాం. వాగులు, వంకలపై చెక్ డ్యాములు కట్టి నీటిని వృథా పోకుండా ఆపి భూగర్భ జలాలను పెంచామని పేర్కొన్నారు.
రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, రుణమాఫీ, రైతు వేదికలు, రైతు కల్లాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రతి ఎకరాకు సాగునీరు, సీసీ రోడ్లు, మురుగు నీటి కాలువలు, తారు రోడ్లు, అంతర్గత రోడ్లు, అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. మిగతా ప్రభుత్వాలకు, కేసీఆర్ ప్రభుత్వానికి తేడాను విశ్లేషించుకోవాలని సూచించారు. మనకు మేలు చేస్తున్న వారికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.