వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేష్తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లబ్దిదారులకు అందజేశారు. వర్ధన్నపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 145 మంది లబ్దిదారులకు 1కోటి 45లక్షల 16వేల 820 రూపాయల విలువైన చెక్కులను పంచారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం చేయనన్ని సంక్షేమ పథకాలను మన కేసీఆర్ ప్రభుత్వం ఇస్తోందన్నారు.
ఇవ్వాళ కేసీఆర్ పేదింటి యువతులకు మేనమామలా మారారని, పేదింటి అమ్మాయిలకు పెండ్లి కోసం 1,00116/- రూపాయలు ఇస్తున్న మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో ఉన్న ఇలాంటి పథకాలు ఎక్కడా లేవని, కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమ తమ రాష్ట్రాల్లో అమలు పరచాలని ఆయా రాష్ట్రాల వాళ్ళు చూస్తున్నారని చెప్పారు. ఒకవైపు కేంద్ర మంత్రులు, అధికారులు రాష్ట్రాన్ని అభినందిస్తుంటే, మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు.
‘‘ఇదెక్కడి న్యాయం? ఇదేం విధానం? వాళ్ళవి నాలుకలా? తాటి మట్టలా? వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చి చెప్పింది. బియ్యం కొనుగోలుకు కూడా కోతలు పెట్టింది. అయినా సీఎం కేసీఆర్.. రూ.30 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకున్నారు. మీరు రైతాంగాన్ని ఆదుకోలేదు. పైగా రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చారు. వ్యతిరేకించిన రైతులను గుర్రాలతో తొక్కించి, తూటాలు పేల్చారు. వరి వేయిద్దు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కేంద్రం చెప్పింది. అయినా, బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాత్రం సిగ్గు లేకుండా వరి వేయమని రైతులను ప్రేరేపిస్తున్నారు’’ అంటూ మంత్రి ఎర్రబెల్లి దుయ్యబట్టారు.
వీళ్లంతా ఎక్కడికి వెళ్ళారు? అలాంటి వాళ్ళను నిలదీయమని ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అపర భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా అందరికీ సాగు నీరు అందిస్తున్నామని చెప్పిన ఆయన.. ముఖ్యమంత్రి దళిత బంధు ఇస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ‘‘మన ఊరు మన బడి’’ కార్యక్రమంతో కృషి చేస్తున్నారని వివరించారు. గతంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కానీ ఇప్పుడు గ్రామాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.