మహబుబాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జిల్లాలోని బయ్యారం మండలం చోక్లా తండా నుంచి గురిమెల్ల వరకు కోటి 75 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు పనులు, బయ్యారంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు.
ఓవర్ హెడ్ ట్యాంకుని ప్రారంభించారు. గంధంపల్లిలో సీసీ రోడ్ల ను ప్రారంభించారు. అనంతరం కొత్త పేటలో చెక్ డ్యాం ను ప్రారంభించారు. సాయంత్రం కాచన పల్లి పరిధిలోని రామన్నపేటలో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రతి ఊరిలో సమస్యలన్నింటిని దశలవారీగా పరిష్కరించి, సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై, తమ తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. పల్లె ప్రగతితో నేడు గ్రామాలు కళకళలాడుతున్నాయన్నారు. ఏ సమస్య ఉన్నా ప్రజలు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చెబుతున్నారని, దీంతో వెంటనే పరిష్కారం అవుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.