జనగామ, సెప్టెంబర్ 17 : సమాజ సేవ చేసే లయన్స్ క్లబ్లో సభ్యునిగా చేరడం గొప్ప అదృష్టం. లయన్స్ క్లబ్ స్ఫూర్తితోనే తాను ఎర్రబెల్లి ట్రస్టును ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు చేస్తున్నానని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం పాలకుర్తి లయన్స్ క్లబ్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని లయన్స్ క్లబ్లో సభ్యునిగా చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సమాజ సేవ చేసే లయన్స్ క్లబ్లో సభ్యునిగా చేరడం గొప్ప అవకాశం అన్నారు.
సేవల నిలయంగా వెలుగొందుతున్న పాలకుర్తి మహనీయులకు జన్మనిచ్చిన గడ్డ. రామాయణ కావ్య సృష్టికర్త వాల్మీకి, ఆదికవి, తొలి తెలుగు విప్లవ కవి పాల్కురికి సోమనాథుడు, సహజకవి బమ్మెర పోతన జన్మించిన పాలకుర్తి నియోజకవర్గం ధార్మిక కేంద్రంగా వెలుగొందేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి చారిత్రిక ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతున్నామని చెప్పారు.320ఎఫ్ జిల్లా కేంద్రం వరంగల్లో లయన్స్ సేవా భవనం నిర్మాణం కోసం కావాల్సిన అనువైన భూమి ప్రభుత్వం నుంచి ఇప్పించడానికి పూర్తి సహాకారం అందిస్తామన్నారు.
ఈ సదస్సులో జిల్లా గవర్నర్ ఎన్.వెంకటేశ్వర రావు, మల్టిపుల్ చైర్మన్ తీగల మోహన్ రావు. గ్లోబల్ యాక్షన్ టీం నాయకులు ఆవుల గోపాల రావు, గోలి అమరేందర్ రెడ్డి, మనోజ్ కుమార్ పురోహిత్, జి. చెన్నకిషన్ రెడ్డి, జిల్లా పూర్వ గవర్నర్లు కన్న పరశురాములు, ముచ్చా రాజిరెడ్డి, టి.లక్ష్మీ నరసింహారావు, కే.సి. జాన్ బన్నీ, డా.రాజేందర్ రెడ్డి, పోకల చందర్, కే.అంజయ్య, వైస్ జిల్లా గవర్నర్లు కుందూరు వెంకట్ రెడ్డి, డా.చంద్రశేఖర ఆర్యా, కార్యక్రమ కో ఆర్డనేటర్లు వి.ప్రసాద రావు, డా.అజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.