హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మనసున్న మారాజు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వారి గురించి అలోచించి అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత BRS ప్రభుత్వానికి దక్కుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక శాఖల నేతృత్వంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అధ్వర్యంలో దివ్యాంగుల శిక్షణను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు అవసరమైన అన్ని వసతులు ప్రభుత్వ పరంగా సమకూరుస్తున్నారు. ట్రై వెహికల్స్, ఇతర పరికరాలు ఉచితంగా అందచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. పెన్షన్ ను 4000 రూపాయలకు పెంచారు. దేశంలోనే అత్యధికంగా ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణను టూరిజం స్పాట్ గా మంత్రి కేటీఆర్ తీర్చిదిద్దుతూహైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరం గా అభివృద్ది చేస్తున్నారని చెప్పారు.
మన రాష్ట్ర ఆతిథ్యం కోసం ఇతర దేశాలు వాళ్లు పోటీ పడే పరిస్థితికి వచ్చింది. మనకున్న విశేషాలు, అనుకూలతలు చూసి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద కంపెనీలు ముందుకొస్తున్నాయని పేర్కొన్నారు. వారందరికీ మనమంతా మంచి ఆతిథ్యం ఇవ్వాలన్నారు. ఈ శిక్షణ ద్వారా ప్రతి ఒక్కరూ ఈ రంగంలో నిష్ణాతులు కావాలని ఆకాంక్షించారు.