జనగామ : పాలకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) ఎన్ని కల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గురువారం దేవరుప్పుల మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా దేవరుప్పులలోని కొత్తవాడలో కలియ తిరుగుతూ..అక్కడి ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో జరిగిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. అందుకు నిదర్శనం కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులు, రివార్డులు అందజేయమేనన్నారు. ఎన్నికల సమయంలో మాయ మాటలతో వస్తున్న కాంగ్రెస్, బీజేపీల మాటలు నమ్మొద్దన్నారు. చేస్తున్న అభివృద్ధిని చూసి మరోసారి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.