జనగామ, నవంబర్ 3 : తండాల తలరాతలు మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని, అలాంటి కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని మంత్రి, ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. పాలకుర్తి మండలం దుబ్బతండా, గుడికుంట తండాల్లో తండా బాట నిర్వహించారు. పార్టీ జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన ప్రచార సభలలో మంత్రి మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో గూడాలకు మహర్ధశ పట్టిందన్నారు. నేడు స్వంతంద్ర పాలన సాగించుకుంటూ గ్రామ పంచాయతీలుగా వెలుగొందుతున్నాయని పేర్కొన్నారు.
నాడు 7శాతమే రిజర్వేషన్లు ఉంటే.. నేడు కేసీఆర్ సీఎం అయ్యాక 12శాతానికి రిజర్వేషన్లు పెంచారు. గ్రామాలకు దీటుగా గిరిజన తండాల అభివృద్ధి పరచిన ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. ఎస్టీలలో వర్గీకరణ చిచ్చుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడు. తండాలకు ఓట్ల కోసం వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టండని పిలుపునిచ్చారు.
తెలంగాణకు ముందు రాష్ట్రంలో తండాలు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయో విశ్లేషించుకోవాలి. తమ పరిపాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వని హామీలు, తెలంగాణలో కాంగ్రెస్ ఇస్తున్నది. అక్కడ లేనిది ఇక్కడ ఇస్తామంటే నమ్మాలా? ఆ పార్టీ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే!. కాంగ్రెస్ వచ్చేది లేదు. ఇచ్చేది లేదు అన్నారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను పార్టీని గెలిపించాలన్నారు.
Minister Errabelli ,CM KCR ,Thandas,Telangana Elections 2023