చండూరు: బీజేపీ మతతత్వ పార్టీ అని, ప్రజల మధ్య చిచ్చుపెట్టి విచ్ఛిన్నం చేయడమే ఆ పార్టీ విధానమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా చండూరు మున్సిపాలిటీలో మంత్రి ఎర్రబెల్లి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ రవీందర్ రావు, వరంగల్ కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, మున్సిపాలిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకో లేదని, పైగా మరిన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వాలను కూల్చడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, కుట్రలు, కుతంత్రాలు ఆ పార్టీ సిద్ధాంతాలుగా మారాయన్నారు. ప్రజలు బీజేపీని నమ్మవద్దని, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్లను భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు మద్దతుగా నిలవాలని ఓటర్లను కోరారు.