హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని గడ్డి పోచలా వదిలేసిన నిబద్ధత గల రాజకీయవేత్త, తెలంగాణ స్వాంత్రంత్య సమరయోధుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో గల తన క్యాంప్ కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర ఉద్యమం, నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. ఆసిఫాబాద్ నుంచి శాసనసభ్యుడిగా అనేక సార్లు ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడని పేర్కొన్నారు. నిఖార్సయిన తెలంగాణ వాది బాపూజీ అని కొనియాడారు. 97 యేండ్ల వయస్సులో కూడా తెలంగాణ కోసం పరితపించి మలి దశ ఉద్యమాలలో పాల్గొన్నారు.
తన జల దృశ్యాన్ని ఉద్యమాలకు అడ్డాగా మార్చిన త్యాగశీలి, రాష్ట్ర చేనేత సహకార రంగానికి అనేక సేవలు చేశారన్నారు. స్వరాష్ట్రం కోసం 75ఏళ్లు ఉద్యమం చేశారు. బడుగు బలహీనవర్గాల అభివృద్ది కొరకు కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ఏర్పాటుకు తాను వుంటున్న జల దృశ్యాన్ని అప్పగించిన మహోన్నత వ్యక్తి గా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచిపోతారు.