రాయపర్తి(వరంగల్) : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. వరంగల్ జిల్లా(Warangal District) రాయపర్తి సూర్యాతండా , రాయపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు(Maize purchase Centres) కేంద్రాలను ప్రారంభించారు. పెరవేడు మ్యాక్స్ భవనంలో కుట్టు శిక్షణ ముగింపు వేడుకల్లో పాల్గొని మాట్లాడారు.
జీవో 58,59 ప్రకారం క్రమబద్ధీకరించిన ఇండ్ల పట్టాలను పలువురికి పంపిణీ చేశారు. కాట్రపల్లిలో రైతు వేదికలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబంతో సహా, దేశం బాగుపడుతుందన్నారు. సహజంగా మహిళల్లో పొదుపు, మదుపు, నిర్వహణ అద్భుతంగా ఉంటాయని చెప్పారు. పేదరిక నిర్మూలన సంస్థ , స్త్రీ నిధి సంస్థ ద్వారా డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ, వడ్డీలేని, బ్యాంకు లింకేజీ రుణాలు(Bank Linkage Loans) అందచేస్తున్నామన్నారు.
మహిళల రికవరీ బాగుండటం వల్ల బ్యాంకులు కూడా ఎంత అడిగితే అంత మహిళలకు ఇస్తున్నారన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి వరంగల్ టెక్స్ టైల్ పార్క్ (Text Tile Park)లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఆయా రైతుల పంటలను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు ఇస్తున్న ది ఒక్క తెలంగాణ రాష్ట్రమేనని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, డీఆర్డీవో సంపత్ రావు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.