పాలకుర్తి : ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడ్డ తెలంగాణ స్వరాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాలకుర్తి నియోజకవర్గం నూతన గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సుపరిపాలన వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నాయకత్వంలో ప్రజా భాగస్వామ్యంతో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన చేరుకున్నదని అన్నారు. గ్రామ పంచాయతీలకు పలు సంస్కరణలతో సమృద్ధిగా నిధులు, విధులు ఇవ్వడంతో అభివృద్ధి అద్భుతంగా కొనసాగుతున్నదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మకంగా ప్రగతి పథం(Developments)లో పల్లెలు నడుస్తున్నాయి. మౌలిక సదుపాయాలతో గ్రామాల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు అయ్యాయి. ఉమ్మడి పాలనలో అధోగతిలో గ్రామాలు ఉండేవి. విధులు, నిధులు ఉండేవి కావని పేర్కొన్నారు.
60 ఏళ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరగక వెనుకబడిపోయిందని వివరించారు. ప్రభుత్వం ఏకకాలంలోనే పరిపాలనా విభాగాల పునర్విభజన చేపట్టిందని, కొత్త పరిపాలనా విభాగాలను కూడా ఏర్పాటు చేసిందన్నారు. 2016 అక్టోబర్ కు ముందు తెలంగాణలో 10 జిల్లాలుండగా నేడు 33 జిల్లాలు అయ్యాయని తెలిపారు. చిన్న పరిపాలనా విభాగాలతో సమర్దవంతమైన పాలన కొనసాగుతుందని ఆయన వివరించారు. కొత్త డివిజన్లు, మండలాలు, పంచాయతీలను ఏర్పాటుచేసిందన్నారు.
ఉత్సాహవంతులైన యువ కలెక్టర్లను కొత్త జిల్లాలకు కేటాయించడంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. పోలీసు కమిషనరేట్ల పరిధి, పోలీస్టేషన్ల పరిధి తగ్గడం వల్ల నేర నియంత్రణ, నేర పరిశోధన సులువైందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.