ప్రశాంతంగా గణేశ్ నిమజ్జనం జరుగుతున్న హైదరాబాద్లో మత ఘర్షణలు రెచ్చగొట్టడం కోసమే అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ వచ్చారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. అసోంలోనూ గణేశ్ నిమజ్జనం జరుగుతున్నదని, హేమంత బిశ్వ శర్మ అక్కడ పాల్గొనకుండా హైదరాబాద్కు రావడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. హనుమకొండలోని పద్మాక్షిగుట్ట సిద్ధేశ్వర గుండం చెరువు, బంధం చెరువుల వద్ద శుక్రవారం నిర్వహించిన వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమంలో ఆయన చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, తెలంగాణలో ఎనిమిదేండ్లనుంచి సీఎం కేసీఆర్ సారథ్యంలో ఎలాంటి అల్లర్లు జరుగకుండా వినాయక నిమజ్జనం జరుగుతున్నదన్నారు. ఈసారి అసోం సీఎం రాకవల్లే హైదరాబాద్లో ఉద్రిక్తత నెలకొందని పేర్కొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణలో రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ నేతలు మతఘర్షణలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వరంగల్లో వినాయక నిమజ్జనానికి అధికారులు సమన్వయంతో పనిచేసి, మంచి ఏర్పాట్లు చేశారని అభినందించారు.