హైదరాబాద్ : ఐదో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చురుగ్గా పాల్గొంటున్నారు. మోరీలను సాఫ్ చేస్తూ.. పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ..
అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ..ప్రజలను భాగస్వాములను చేస్తూ.. ఉత్తేజ పరుస్తూ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఈ నెల 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతిలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా పాలకుర్తిలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి గ్రామంలో వాడవాడలా తిరిగారు. ప్రజలతో మాట్లాడుతూ పారిశుద్ధ్యం పై అవగాహన కల్పించారు.
చెత్తా చెదారం ఉండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కాలువల్లో మట్టి, చెత్త పేరుకుపోవడం చూసి వెంటనే మంత్రి స్వయంగా తొలగించారు. అలాగే గ్రామస్థులను పలకరిస్తూ వారి యోగ క్షేమాలను అడి తెలుసుకున్నారు.
కొడకండ్ల మండలం రేగులలో మంత్రి ఉపాధి హామీ కూలీలతో మమేకం అయ్యారు. వారితో కలిసి పని చేశారు. ఉపాధి కూలీలు పెట్టిన చద్దన్నం తిన్నారు. ఆ బువ్వ కమ్మగా ఉందంటూ.. అందరినీ సంతోష పెట్టారు. అందరితో ఔరా!. అనిపించుకుంటూ..సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పల్లె ప్రగతి కార్యక్రమాలకు బయలుదేరారు.