మహబూబాబాద్, సెప్టెంబర్ 20 : మహిళలు పారిశ్రామికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. మహిళలు బాగుపడితేనే దసమాజం బాగుపడుతుంది. అందుకే సీఎం కేసీఆర్ను ఒప్పించి పైలట్ ప్రాజెక్టుగా పాలకుర్తి నియోజకవర్గంలో ఉచిత కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని, మహిళలంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు.
కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న పెద్దవంగర, తొర్రూరు, రాయపర్తి మండలాల మహిళలకు తొర్రూరులో సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. మహిళలు పడుతున్న ఇబ్బందులు నా కళ్లారా చూసిన. అందుకే నేను కుట్టు శిక్షణ, కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాను. 5 కోట్ల 10 లక్షల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని పాలకుర్తిలో ప్రయోగాత్మకంగా చేపట్టిన.
మొత్తం 10 వేల మందికి శిక్షణ ఇవ్వటం నా లక్ష్యం అన్నారు. మొదటి విడతగా 3వేల 861 మందికి శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పూర్తిచేసుకున్న వారికి కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి వివరించారు. శిక్షణ పూర్తి అయిన వాళ్లకు ఈ జూలై నుంచి వరంగల్ టెక్ట్స్టైల్స్ పార్క్ లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఉద్యోగాలకు వెళ్లడం ఇష్టం లేని వాళ్లకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే మీ రుణం తీర్చుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.