జనగామ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రంజాన్ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వమే దు స్తుల పంపిణీ చేయడం, ఎమ్మెల్యేలు, మంత్రులు, స్వయంగా సీఎం ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మీరు గతంలో ఎప్పుడైనా, ఎక్కడైనా చూశారా? తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక్క చిన్న ఘర్షన జరిగిందా? బీజేపీ మాత్రం మత ఘర్షణలను సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నది. పాలు నీళ్ల లెక్క కలిసి ఉండే హిందూ ముస్లిం ల మధ్య చిచ్చు పెట్టి రెచ్చ గొట్టి ఓట్లు దండుకునే పిచ్చి పనులు బీజేపీ చేస్తున్నది. గతంలో ghmc ఎన్నికల్లో ఈ విధంగా చేసినప్పటికీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.
మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్న దని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, విదేశీ విద్య కోసం ఒక్కో విద్యార్థికి 20 లక్షల స్కాలర్షిప్, రిజర్వేషన్ల పెంపు కోసం విఫల యత్నం, ఉపాధి అవకాశాలను మెరుగు పరచడం వంటి అనేక చర్యలను సీఎం కెసిఆర్ తీసుకున్నారని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. ముస్లిం సోదరులకు మంత్రి రంజాన్ శుభాకాంక్షలు అందచేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.