హైదరాబాద్ : రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli ) ఆదేశించారు. ముఖ్యంగా పల్లెల్లో పండుగ వాతావరణంలో జరిపి శాఖల ఉన్నతిని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై శుక్రవారం బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష(Review) నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరిచిపోలేని విధంగా పల్లెల్లో(Villages) కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జూన్ 2వ తేది నుంచి 23వ తేదీ వరకు రోజుకో కార్యక్రమం చొప్పున 21 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించాలన్నారు.
పల్లె ప్రగతి(Palle Pragathi)పై గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వం గ్రామంలో చేపట్టిన అభివృద్ధిని వివరించాలని పేర్కొన్నారు. పదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి విజయాలను ప్రజలకు తెలిసేలా ప్రదర్శనలు జరగాలని తెలిపారు. ప్రతి ఇంటి ముందు రంగవల్లులకు మహిళలను సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాల్లో మహిళా సంఘాల ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచాలని అన్నారు. మహిళా సంఘాల(Womens Group)కు ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో అభివృద్ధి చెందుతున్న తీరును వివరించాలి.
గ్రామాల్లో కల్పించిన మౌలిక సదుపాయాలను వివరించాలి
నర్సరీలు(Nurserys), డంపింగ్ యార్డులు(Dumping Yards), కల్లాలు, రైతు వేదికలు, స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాల ఏర్పాటు గురించి వివరిస్తూ గ్రామాల్లో దండోరాలు వేసి, ఉత్సవాలను నిర్వహించాలని చెప్పారు. ర్యాలీలు, మానవహారాలు నిర్వహించాలన్నారు. తెలంగాణకు ముందు, తర్వాత జరిగిన అభివృద్ధిపై డాక్యుమెంటరీలు రూపొందించాలని, నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
శాఖల పరిధిలో ఉత్తమ సేవలందిస్తున్న వారిని గుర్తించి వారిని సన్మానించాలన్నారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని మంత్రి దయాకర్ కోరారు. ఈ సమీక్షలో స్పెషల్ కమిషనర్ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్లు జాన్ వెస్లీ, రామారావు, రవీందర్, మిషన్ భగీరథ ఇఎన్సీ కృపాకర్ రెడ్డి, సెర్ప్ డైరెక్టర్లు రజిత, తదితరులు పాల్గొన్నారు.